
న్యూఢిల్లీ: బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించడంపై భారత సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ‘బేషరతుగా క్షమాపణలు’ చెప్పారు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అయిన కార్తీక్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్బాగో నైట్రైడర్స్ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం.. బీసీసీఐకి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అనుమతి తీసుకోకుండా.. ఈ మ్యాచ్లకు హాజరుకావడంపై బోర్డుకు బేషరతుగా కార్తీక్ క్షమాపణ చెప్పారు.
బీసీసీఐ అనుమతి లేకుండానే సీపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు వెళ్లిన కార్తీక్.. అక్కడ ట్రిన్బాగో జట్టు జెర్సీ ధరించి.. ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో కూచొని.. సీపీఎల్ మ్యాచ్లను తిలకించాడు. ట్రిన్బాగో జట్టు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ది కావడం.. అతని యాజమాన్యంలోని కోల్కతా నైట్రైడర్స్కు ఐపీఎల్లో దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా సీపీఎల్ జట్టు డ్రెసింగ్ రూమ్లో కార్తీక్ కనిపించడంతో అతని కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.