
పాకిస్థాన్ అనూహ్య విజయం
శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్థాన్ అనూహ్య విజయం సాధించింది.
పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్థాన్ అనూహ్య విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. 377 పరుగుల టార్గెట్ ను సునాయాసంగా ఛేదించింది. 103.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. ఓపెనర్ షాన్ మసూద్ (125), సీనియర్ బ్యాట్స్మన్ యూనిస్ ఖాన్ (171) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ మిస్బా(59) అర్ధసెంచరీతో రాణించాడు.
13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును వీరు ముగ్గురు అసమాన ఆటతీరుతో విజయ తీరాలకు చేర్చారు. మూడో వికెట్ కు 242, నాలుగో వికెట్ కు 127 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ లో లంక 278, పాక్ 215 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 313 పరుగులకు ఆలౌటైంది.
ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో పాకిస్థాన్ కైవసం చేసుకుంది. యూనిస్ ఖాన్ 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' దక్కించుకున్నాడు. 12 వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ యాసిర్ షా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నాడు.