
ఈ సెంచరీ వెరీ వెరీ స్పెషల్!
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో తాను సాధించిన శతకం ఎంతో ప్రత్యేకమైనదని టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు.
ముంబై: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో తాను సాధించిన శతకం ఎంతో ప్రత్యేకమైనదని టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. మూడోరోజు ఆట నిలిపివేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు ఇన్నింగ్స్ ల్లో తాను పూర్తిగా విఫలం కావడంతో తనపై ఎంతో ఒత్తిడి పెరిగిందన్నాడు. దీంతో సరైన సమయంలో తన బ్యాట్ నుంచి పరుగులు రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నాడు.
‘గత నాలుగు ఇన్నింగ్స్ లలో పరుగులు చేయాలని ప్రయత్నించినా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాను. ఈ టెస్టులో క్లియర్ మైండ్ సెట్ తో బ్యాటింగ్ చేశాను. ఈ టెస్టుకు ముందు వారం రోజుల విరామం రావడం కూడా కలిసొచ్చింది’ అని సెంచరీ వీరుడు విజయ్ వివరించాడు. 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ ఇక్కడ టెస్టు సెంచరీ చేసిన 14 ఏళ్లకు శతకం నమోదు చేసిన ఓపెనర్ గానూ విజయ్ రికార్డు నెలకొల్పాడు.
మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.