
ఏపీ సర్కారు దొంగాట!
హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. స్విస్ చాలెంజ్ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉండగానే సీఆర్డీఏ నోటిఫికేషన్ లో ఏపీ సర్కారు సవరణలు చేసింది. ఎలిజిబిలిటీ బిడ్డింగ్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 13 వరకు, కమర్షియల్ బిడ్డింగ్ ను సెప్టెంబర్ 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్విస్ చాలెంజ్ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలు రాకముందే హడావుడిగా చర్యలు తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే సీఆర్డీఏ నోటిఫికేషన్ లో మార్పులు చేర్పులు చేసింది.
వివరాల సేకరణకు సమయం పడుతుందని స్విస్ చాలెంజ్ వ్యవహారంపై విచారణ సందర్భంగా ఏపీ ఏజీ కోర్టుకు విన్నవించారు. రేపు మళ్లీ విచారణ జరగనుంది. దీనిపై హైకోర్టు రేపు ఆదేశాలు ఇచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఆంగ్ల దినపత్రికలో సవరణ నోటిఫికేషన్ జారీ చేయడం వివాదాలకు తావిస్తోంది. అదే సమయంలో అర్హతా నియమాల మార్పుపై చంద్రబాబు సర్కారు నోరు విప్పడం లేదు.