ఏ ముచ్చటైనా జరగాల్సిన సమయంలోనే జరగాలంటారు పెద్దలు. అలా జరగకపోతే అసలుకే ఎసరొస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.
ముంబై: ఏ ముచ్చటైనా జరగాల్సిన సమయంలోనే జరగాలంటారు పెద్దలు. అలా జరగకపోతే అసలుకే ఎసరొస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అచ్చటా ముచ్చటా జరగాల్సిన సమయంలోనే జరిగితే ఎటువంటి సమస్యలుండవని, ఆలస్యమైతే సంతానలేమి సమస్యతో బాధపడాల్సిందేనని చెబుతున్నారు. ‘హెల్పింగ్ ఫ్యామిలీస్’అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశంలోని తొమ్మిది నగరాల్లో 100 మంది సంతాన సాఫల్య నిపుణులతోపాటు 2,562 మందిని ప్రశ్నించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. శృంగార సామర్థ్యం తక్కువ నుంచి అతి తక్కువగా ఉన్నవారిలో 46 శాతం మంది 31 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నవారేనని తేలింది. వీరిలో 63 శాతం మంది శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తర చూ వైద్యులను సంప్రదిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. వీరిలో ఈ సమస్య తలెత్తడానికి సంతాన సాఫల్య వైద్య నిపుణులు అనే క కారణాలను వెల్లడిస్తున్నారు.
జీవన విధానంలో మార్పులు చోటుచేసుకోవడం, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవారిలో ఇటువంటి సమస్య తలెత్తే అవకాశం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం ద్వారా సదరు యువతీయువకులు మానసిక ఒత్తిడికి గురవడంతోపాటు వ్యసనాలకు బానిసలయ్యే అవకాశముందని, ఇది వారిలో శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇవేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా ఇందుకు కారణం కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శృంగారంపట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలు కూడా ఈ సమస్యను మరింత ఎక్కువగా చేస్తున్నాయంటున్నారు.అసలైన వయసులో మూఢవిశ్వాలను నమ్ముతూ శృంగారానికి దూరంగా ఉండడంతో వారిలో సామర్థ్యం తగ్గిపోతోందని, సమయం వచ్చేసరికి మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారని, అవగాహన పెంచుకోవడమే దీనికి పరిష్కారమని చెబుతున్నారు.