
‘50 రోజుల్లో ఏం చేస్తారో చెప్పాలి’
హైదరాబాద్: అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ముందుస్తు చర్యలు తీసుకోకుండా సంక్షోభాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నల్లధనం ఉన్నవారెవరు బ్యాంకులకు వెళ్లడం లేదని అన్నారు.
విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 86 శాతం నగదు పెద్ద నోట్ల ద్వారానే చెలామణి అవుతోందని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన రూ. 2000 నోట్లతో నల్లధనం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దుపై కొన్ని పత్రికల్లో ముందే వార్తలు రావడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. నల్లధనం.. బంగారం రూపంలోకి మారుతోందని అన్నారు. 50 రోజుల్లో ప్రధాని మోదీ ఏం చేస్తారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.