నేడు యూత్ కాంగ్రెస్ బైక్ర్యాలీ
Published Sat, Sep 28 2013 11:03 PM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
సాక్షి, న్యూఢిల్లీ: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న బైక్ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు పశ్చిమ ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ శర్మ తెలిపారు. బీజేపీ వికాస్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయానికే కాంగ్రెస్ పార్టీ యూత్ ర్యాలీ చేపట్టడం గమనార్హం. ర్యాలీలో ఐదు వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఉత్తమ్నగర్ నియోజకవర్గంలోని విపిన్ గార్డెన్ నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు బైక్లపై కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకుని ర్యాలీగా బయలుదేరనున్నారని చెప్పారు.
పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళతామని రాహూల్ శర్మ అన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆధ్యర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న వికాస్ ర్యాలీ ఓ నాటకమన్నారు. ఢిల్లీలోని యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. విధాన సభ ఎన్నికల్లో ఉత్తమ్ నగర్ సహా అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందన్నారు. ఆదివారం నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో గుజరాత్ నుంచి సైతం ఎన్ఎస్యూఐ సభ్యులు పాల్గొంటున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement