
చెన్నై : ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం మధుర మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ తూర్పు రాజగోపురం సమీపంలోని వేయీళ్ల మండపం వద్ద శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని 50కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని మధురై కలెక్టర్ చెప్పారు.
అగ్నిప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వీరరాఘవరావు ఆలయం వద్దకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పదుల సంఖ్యలో ఫైర్మన్లు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో భక్తులు, ఆలయసిబ్బంది అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లైంది. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని కలెక్టర్ చెప్పారు. కాగా, విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.