గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా.. | Anna Hazare to inaugurate youth leadership conference in Hyderabad | Sakshi
Sakshi News home page

గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా..

Jan 19 2019 3:05 AM | Updated on Jan 19 2019 6:03 PM

Anna Hazare to inaugurate youth leadership conference in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి –నూతన ఆవిష్కరణ’లే ప్రధాన ఎజెండాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ గచ్చిబౌలి నోవాటెల్‌లో అంతర్జాతీయ యువజన సదస్సు ప్రారంభమైంది. 135 దేశాలకు చెందిన 550 మంది ప్రతి నిధులతోపాటు 16 దేశాల నుండి డెబ్బై మందికిపైగా నిపుణులు హాజరయ్యారు. తొలిరోజు సం ప్రదాయ దుస్తుల్లో హాజరైన దేశ, విదేశీ ప్రతినిధులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి తెలంగాణ వంటకాలు వడ్డించారు. ఐక్యరాజ్యసమితి లక్ష్యసాధనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు పేదరిక నిర్మూలన, ఆహార సమృద్ధి, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, జెండర్‌ ఈక్వాలిటీ వంటి పదిహేడు అంశాలపై లోతైన చర్చలు, విశ్లేషణలు సాగనున్నాయి.



అన్నా హజారే తొలివక్తగా...
పద్మభూషణ్‌ అన్నాహజారే శనివారం ఉదయం సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి సార్క్‌ మాజీ సెక్రటరీ జనరల్‌ అర్జున్‌ బహదూర్‌ తాపా ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. సదస్సులో ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌గుప్తా, ఎంపీలు గౌరవ్‌ గొగోయ్, అసదుద్దీన్‌ ఒవైసీ, కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొననున్నారు. ఆయా సెషన్లలో వివిధ అంశాలపై మాసిడోనియా మాజీమంత్రి గ్లీగోర్, యూకే ఎంపీ సీమా మల్హోత్రా, న్యూజిలాండ్‌ ఎంపీ కన్వల్జిత్‌సింగ్‌ బక్షీ, శ్రీలంక డిప్యూటీ మినిస్టర్‌ బుధీక పతిరాన పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం వివిధ అంశాలపై అర్పిత్‌ చతుర్వేది, పుల్లెల గోపీచంద్, కమల్‌సింగ్, షబ్నం సిద్ధిఖీ, అండ్రూ ఫ్లెమింగ్, సీమా మల్హోత్రా తదితరులు ప్రసంగిస్తారు.  

భవిష్యత్‌ అవసరాల కోసమే: ఎంపీ కవిత
సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే దిశగా  మూడు రోజుల అంతర్జాతీయ యువజన సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement