
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ అధికారులపై వ్యవహరిస్తున్న తీరే తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ చట్టం మార్పులు రైతులకు, అధికారులకు ఇబ్బందిగా మారాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో నేపథ్యంలో జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. లంచాన్ని అరికట్టడం ఏ నాయకునితో సాధ్యంకాదని, ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకుల తప్పిందం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె మృతికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు రాజేందర్, రవీందర్ రెడ్డి, మమతలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
(చదవండి: తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది?)
సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నమస్తే తెలంగాణాలో పత్రికలో ప్రసారం అవుతున్న ధర్మగంట కార్యక్రమం రైతులు, అధికారులకు మధ్య వైరాన్ని పెంచింది. రెవెన్యూ అధికారులపై ధర్మగంట ప్రజల్లో విషాన్ని, ద్వేషాన్ని నురిపోసింది. కేసీఆర్ నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు గుడ్డిగా నమ్ముతూ.. ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నది నిజం కాదా.?. రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు.. ఉద్యోగ సంఘాలే తీరే కారణం. ప్రభుత్వం మేల్కొని అధికారులు.. ప్రజలకు మధ్య మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ప్రభుత్వం మేల్కొకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది’ అని అన్నారు.