
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని ఒక గంట సమయంలో మౌఖికంగా చెప్పి రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించిన లక్ష్మీశ్రీజ(10) తెలంగాణ అద్భుత బాలిక అని వక్తలు కొనియాడారు. బుధవారం శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని లక్ష్మీశ్రీజ, ఆమె తల్లిదండ్రులు, న్యూ ఎరా స్కూల్ యజమాని రమణారావు కలిశారు.
ఈ సందర్భంగా స్పీకర్ చాంబర్లో లక్ష్మీశ్రీజ భారత రాజ్యాంగాన్ని సునాయాసంగా పఠనం చేయడాన్ని చూసి అక్కడికి వచ్చిన అతిథులు శ్రీజ జ్ఞాపకశక్తిని ప్రశంసించారు. శ్రీజ లాగా రాజ్యాంగాన్ని అలవోకగా చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదని స్పీకర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ నారదాసు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ మెంబర్ జూలూరి గౌరీ శంకర్ ఆమెను అభినందించారు.