యాచారం: మండలంలో ఉన్న విద్యుత్ సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తానని, గ్రామాల్లో ఉన్న సమస్యలపై సర్పంచ్లు వెంటనే నివేదిక అందజేయాలని ఆ శాఖ ఎస్ఈ బాలకిషన్ పేర్కొన్నారు. ఈ నెల 24న మండల కార్యాలయంలో జరిగిన ‘మన ఊరు...మన ప్రణాళిక’ సమావేశంలో గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై జిల్లా కలెక్టర్కు సర్పంచ్లు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి మండలానికి ఎస్ఈని పంపించి సమస్యలు పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఆ మేరకు ఎస్ఈ బాలకిషన్ సోమవారం డీఈ రాఘవేందర్రావు, ఏడీ చక్రవర్తి, మండల ఏఈ శ్రీనివాస్తో కలిసి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, జడ్పీటీసీ కర్నాటి రమేష్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లతో సమావేశమయ్యారు. ఒక్కో గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను మార్చి, ఏళ్ల కింద ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలను వెంటనే తొలగిస్తామని అన్నారు.
విద్యుత్ సబ్స్టేషన్ల గ్రామాల్లో 24 గంటల పాటు సింగల్ ఫేజ్ విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాబోయే ఐదేళ్ల కాలంలో అదనంగా మరో ఐదు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. బిల్లులు చెల్లింపుల విషయంలో ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. అత్యవసరంగా వ్యవసాయ పొలాల వద్ద ప్రమాదకరంగా కిందకు వేలాడే తీగలను మార్చి, అవసరమైన చోట స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిధులకు కోరత లేదు, సమస్యలన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఎంపీపీ, జెడ్పీటీసీలు మాట్లాడుతూ... అసలే భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి, నాణ్యమైన ఏడు గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేయాలని కోరారు. ఎల్ఆర్ పేరుతో రాత్రి పూట గంటల కొద్దీ కోతలు విధించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య వచ్చినప్పుడు విద్యుత్ సిబ్బంది తక్షణమే స్పందించే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాశ్ఛ బాషా, నర్రె మల్లేష్, గౌర నర్సింహ, సత్యపాల్, నర్సయ్య, బండిమీది కృష్ణ, మల్లేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, టీడీపీ నాయకులు లిక్కి నర్సింహరెడ్డి, ఉడుతల జంగయ్యగౌడ్, రమావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలకు చెక్
Published Tue, Jul 29 2014 12:28 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement
Advertisement