
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నా రు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన నుంచి నిధుల సద్వినియోగం వరకు ప్రతీ దశలోనూ పూర్తిస్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని స్పష్టంచేశారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్తో కలిసి కేసీఆర్ మంగళవారం రెండో రోజు ప్రగతి భవన్లో కసరత్తు చేశా రు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చ జరిగింది. సెప్టెంబర్లో వినాయక చవితి ఉత్సవా లు, నిమజ్జనం, మొహర్రం పండుగలున్నాయి. ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్లు, సెక్రటరీల సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ పాల్గొంటారు. ఈ విషయాలన్నిం టి దృష్ట్యా సెప్టెంబర్ 4, 9, 14 తేదీల్లో సమావేశాలు ప్రారంభించవచ్చని అసెంబ్లీ కార్యదర్శి ప్రతిపాదించారు. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మూడు తేదీల్లో ఒక తేదీని ప్రభుత్వం ఖరారు చేస్తుంది.
గవర్నర్ ప్రసంగం ఉండదు..
ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయ సభలను ఉద్దేశిం చి గవర్నర్ ప్రసంగం చేసినందున బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో చర్చ వంటి ప్రక్రియలుంటాయి. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీని సమావేశపరచడానికి ముందే మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశమవ్వాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేలా ఆయా శాఖలకు సరైన మార్గదర్శనం చేయాలని భావిస్తున్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్రావు, రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.