
'గవర్నర్ పూర్తిగా విఫలమయ్యారు'
సాక్షి,తిరుమల: ఓటుకు కోట్లు ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర విమర్శలకు దిగటం సరికాదని, ఈ పరిస్థితులను చక్కదిక్కదిద్దడంలో ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం శ్రీవారి సందర్శన కోసం తిరుమల వచ్చిన ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
ఒక పార్టీలో గెలిచినవారు మరొకపార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన సందర్భంలోనూ గవర్నర్ రాజ్యాంగ పరంగా వ్యవహరించలేదని ప్రజలు భావిస్తున్నారని పొన్నం అన్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు ఆయా ముఖ్యమంత్రులు, నేతలకు వత్తాసు పలకడం సరికాదన్నారు.
ఇలాంటి తరుణంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం మిన్నకుండటం దారుణమని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేందుకు ఇద్దరు సీఎంలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. వీరి దూకుడుతో భవిష్యత్ తరాల్లో వైషమ్యాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీవారి ఆలయ జీయర్లు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వంటి ధార్మిక పెద్దలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.