
కొరడా
- స్కూళ్లపై దాడులు షురూ..
- కలెక్టర్ ఆదేశించిన 24 గంటల్లోనే..
- ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు
- నారాయణగూడ శ్రీఇంటర్నేషనల్తో బోణీ
- నేటి నుంచి మిగిలిన డివిజన్లలో స్పెషల్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ స్కూళ్లపై సర్కార్ కన్నెర్ర చేసింది. నిబంధనలు పాటించని సంస్థలపై దాడులకు దిగుతోంది. నగరంలోని ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన 24 గంటల్లోనే విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు శుక్రవారం నారాయణగూడలోని ఓ స్కూల్ను ఏకంగా సీజ్ చేశారు. విద్యావ్యవస్థకు పట్టిన చీడను వదిలించేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది.
నగరంలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు యుద్ధాన్ని ప్రకటించారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో అధికారులు రంగంలోకి దిగారు. నగరంలో అనుమతులు లేకుండా పాఠశాలలు కొనసాగడం, పరిమితికి మించి ఫీజులు వసూలు చేయడం తదితర సమస్యలపై గురువారం కలెక్టర్ మీనా విద్యాశాఖపై సమీక్షించి ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై తీవ్రంగా మండిపడిన విషయం తెల్సిందే.
నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే జైల్లో పెడతామంటూ కలెక్టర్ మండిపడ్డారు. అంతేగాక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో ఆ అధికారుల్లో చలనం వచ్చింది. కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసిన 24 గంటల్లోనే రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం హిమాయత్నగర్ మండలం నారాయణగూడలోని శ్రీఇంటర్నేషనల్ స్కూల్ను అనుమతి లేదంటూ సీజ్ చేశారు.
సదరు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దాడులను తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక బృందాలతో సమావేశాలను నిర్వహించారు. స్థానికంగా ఉప విద్యాధికారులతోపాటు తహశీల్దారు, వీఆర్వోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పోలీస్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్
హిమాయత్నగర్:విద్యాశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం నారాయణగూడలోని శ్రీఇంటర్నేషనల్ స్కూల్కు చేరుకున్నారు. ప్రభుత్వ గుర్తింపు లేనందున సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. స్కూల్ సిబ్బందికి, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెవెన్యూ అధికారులతోపాటు పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో విద్యాశాఖ అధికారుల పని సులువైంది. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ‘శ్రీఇంటర్నేషనల్ స్కూల్’ను అధికారులు మూసివేశారు.
ఒకే భవనంలో పాఠశాలతోపాటు జూనియర్ కళాశాల, కోచింగ్ సెంటర్ను కూడా యాజమాన్యం నడుపుతోంది. హిమాయత్నగర్ డిప్యూటీ ఈఓ సురేశ్కుమార్ , తహశీల్దార్ సుగుణ, పోలీసులు ఈ పాఠశాలను సీజ్ చేశారు. ఈ పాఠశాల్లో సుమారు 450 మంది చదువుతున్నారని, అకస్మాత్తుగా పాఠశాలను సీజ్ చే స్తే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
గుర్తింపు లేని స్కూళ్లను సీజ్ చేయండి..
రాంగోపాల్పేట్: ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలలను సీజ్ చేయాలని సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాంశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో సికింద్రాబాద్, మారేడుపల్లి, ముషీరాబాద్ తహశీల్దార్లు విష్ణుసాగర్, సైదులు, సుజాత, ఖైరతాబాద్ డిప్యూటీ తహశీల్దార్ సునీతతోపాటు ఉప విద్యాధికారులు చిరంజీవి, వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు వేణుగోపాలచారి, యాదయ్యలతో సమావేశం నిర్వహించారు. శనివారం నుంచి గుర్తింపు లేని పాఠశాలలను సీజ్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఉల్లంఘనుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రభుత్వం పునరాలోచించాలి..
సుల్తాన్బజార్: ప్రైవేటు స్కూళ్ల ఫీజులకు సంబంధించి జారీచేసిన జీఓపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి సి.రాంచందర్ మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం నిర్ణయించిన ఫీజులనే ప్రైవేటు పాఠశాలలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పడం అన్యాయమన్నారు.
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మధు, పీసీ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్యాంవెరా, ఇన్నారెడ్డి, కిషన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కాప్సి అనుమతి ఉంది..
కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా (కాప్సి) సంస్థ మాకు సీబీఎస్ఈ, ఐజీసీఎస్ఈ అనుమతి ఇచ్చింది. టెన్త్ క్లాస్ కూడా నడుపుకోవచ్చని కాప్సీ తెలిపింది. ఈ విషయం పట్ల విద్యాశాఖ అధికారులకు అవగాహన లేదు. మా సంస్థ విషయంలో తల దూర్చవద్దని (నో ఇంటర్పియర్) హైకోర్టు నుంచి ఆదేశాలున్నాయి.
- పెరిక సురేశ్, శ్రీఇంటర్నేషనల్ స్కూల్ డెరైక్టర్
గుర్తింపు లేనందునే సీజ్..
ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న శ్రీఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని గత మూడేళ్లుగా పలుమార్లు హెచ్చరించాం. అనుమతి లేకుండా పాఠశాల నడపడం నేరం. పలుమార్లు నోటీసులు జారీ చేశాం. బోధించే సిలబస్ ఏదైనా.. నగరంలో పాఠశాల నడపాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే సీజ్ చేశాం.
- సురేశ్,హిమాయత్న గర్ డిప్యూటీ ఈఓ