ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల రంగంలో విశేష సేవలు అందించినందుకు గుర్తుగా రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టుకు విద్యాసాగర్రావు పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలో నిర్ణయించి ప్రతిపాదనలు పంపాలని నీటి పారుదల శాఖను ఆదేశించారు. ఆయన మృతి తెలంగాణ జాతికి తీరని లోటు అని అన్నారు. శనివారం సాయంత్రం ఆయన సతీసమేతంగా వెళ్లి విద్యాసాగర్రావు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
అనంతరం ప్రగతి భవన్ చేరుకున్న సీఎం విషణ్ణ వదనంతో కనిపిం చారు. విద్యాసాగర్ రావు అంత్యక్రి యలను అధికారిక లాంఛనాలతో జరిపించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ని ఆదేశించారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై ఆయన చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్య మైనదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ, సలహాలు ఇస్తూ ముందుకు నడిపారన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ రావు అని సీఎం పేర్కొన్నారు.