
వైఎస్పై అభిమానమే గెలిపించింది
సాక్షి, ఖమ్మం : దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, ప్రేమే తమను ప్రజాప్రతినిధులుగా గెలిపించిందని, నేతలు, కార్యకర్తల శ్రమ ఫలితంమే ఈ విజయమని, వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమని, గిట్టనివాళ్లు కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, వాటిని నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో గురువారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహ/ంచారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గార్డెన్స్లో ఎంపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ చేసిన సేవలను చూసి ప్రజలు, కార్యకర్తలు తమను గెలిపించారని, రానున్న ఐదేళ్లలో జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
2019లో కూడా కార్యకర్తల అండతో ఎన్నికల క్షేత్రంలో దూకుతానని అన్నారు. జిల్లాలో తనపై, పార్టీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని అన్నారు. కుంటిసాకులు చెప్పి పార్టీని వీడిన వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ‘సదరు నాయకుడు ఎందుకు పార్టీ ఫిరాయించాడో, ఆయన ఆలోచన ఏంటో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అందరికీ తెలుసు’ అని అన్నారు. పిలుపునిచ్చిందే తడవుగా ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలివచ్చారు..ఈ విషయం చాలు జిల్లాలో పార్టీ ఎంత బలోపేతంగా ఉందో చెప్పడానికి అని అన్నారు.
గతంలో ఎంపీ అభ్యర్థులుగా గెలిచిన వారు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లారని, తాను వారిలా కాకుండా జిల్లా వాసిగా ఇక్కడే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. త్వరలో పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డితో చర్చించి జిల్లాలో పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ నిధులను వెచ్చిస్తారన్నారు.
అగ్ని సాక్షిగా ప్రమాణం
ఖమ్మంనగరానికి చెందిన పార్టీ నేత వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ మీద కార్యకర్తలకు నమ్మకం ఉండేలా అగ్ని సాక్షిగా ప్రమాణం చేయాలని కోరారు. దీంతో సమావేశంలోని కార్యకర్తలంద రూ ప్రమాణం చేయాలంటూ నినదించారు.వెంటనే ఎంపీ పొంగులేటితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు వేదికపైన వైఎస్ఆర్ విగ్రహం ముం దు ఉన్న జ్యోతి ప్రజ్వలన వద్దకు వెళ్లి పార్టీలోనే ఉంటామంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. వెంటనే కార్యకర్తలు జై జగన్, జై శ్రీనన్న అంటూ నినాదాలు చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే.. : పాయం వెంకటేశ్వర్లు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ అద్భుత ఫలితాలు సాధించి తిరుగులేని శక్తిగా ఎదిగిందని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీనివాస్రెడ్డి పార్టీలో చేరిన పదిహేను నెలల్లోనే ఎన్నో బాధ్యతలను మోస్తూ ఒంటి చేత్తో పార్టీని ముందుకు నడుపుతూ పార్టీకి అనూహ్య ఫలితాలు తెచ్చిపెట్టారన్నారు.
ఇది చూసి ఓర్వలేకే కొందరు తమపై బురద జల్లుతున్నారని, ఎవరు ఎన్ని చేసినా తాను మాత్రం శ్రీనివాసరెడ్డి అడుగుజాడల్లో నడుస్లూ ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే ఉంటానని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. సమగ్ర సర్వే ప్రజలను ఆందోళనకు గురిచేసిందని..దీంతో తమకు సంక్షేమ పథకాలు అందుతాయోలేవోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడుతామన్నారు.
ప్రలోభాలకు గురిచేస్తే చూస్తూ ఊరుకోం.. : తాటి వెంకటేశ్వర్లు
తమ పార్టీ ప్రజాప్రతినిధులను ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, వారి రుణం తీర్పుకోవ డం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతని ఆయన అన్నారు. వైరా ఎమ్మెల్యే మదన్లాల్ ఎంత వేగంగా పార్టీ మారా రో అంతే వేగంగా వైఎస్సార్సీపీలో చేరే రోజు వస్తుందని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే నేతలకు రాజకీయాల్లో పుట్టగతులు ఉండవన్నారు. పోడు భూములకు సంబంధించి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వం అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మాటలకే పరిమితమైందని విమర్శించారు.
‘మామా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.. : గుగులోతు రవిబాబునాయక్
వైఎస్సార్సీపీ కార్యకర్తల శ్రమతో గెలిచిన వైరా ఎమ్మెల్యే మదన్లాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్ గుగులోతు రవిబాబునాయక్ డిమాండ్ చేశారు. ‘మామా.. నువ్వు పదవికి రాజీనామా చేయి.. నీమీద నేనే పోటీ చేస్తా’ అంటూ ఆయన మదన్లాల్కు సవాల్ విసిరారు. ధనార్జనే ధ్యేయంగా రాజకీయాలు చేయడం తగదని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు వైఎస్సార్సీపీ పుట్టిందని, జిల్లాలో ప్రతీ కార్యకర్త దీని కోసం కదం తొక్కుతున్నారని అన్నారు.సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మట్టా దయానంద్విజయ్కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం అన్నారు. కార్యకర్తల శ్రమ, కృషిని పార్టీ ఎప్పటికీ మరువదన్నారు.
ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, కొదమసింహం పాండురంగాచార్యులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ.ముస్తఫా, పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు తోట రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, టీచర్స్ విభాగం అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్, నాయకులు దారా యుగంధర్, కాంపల్లి బాలకృష్ణ, ఏలూరి కోటేశ్వరరావు, సంపెట వెంకటేశ్వర్లు, మార్కం లింగయ్యగౌడ్, జక్కం సీతయ్య, ఐలూరి వెంకటేశ్వర్రెడ్డి, ఏఆర్ కృష్ణారెడ్డి, సుధీర్, అడపా వెంకటనర్సయ్య, పగడాల భాస్కర్నాయుడు, గుండా వెంకటేశ్వర్లు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, భూక్యా అంజయ్య, జల్లేపల్లి సైదులు, పత్తి శ్రీను, కొంగర జ్యోతిర్మయి, తుమ్మా అప్పిరెడ్డి, షకీనా, షర్మిల సంపత్, వంటికొమ్ము శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.