స్థలం రూ.200 కోట్లు.. భవనం రూ.20 కోట్లు | New Building Construction For OU Alumni | Sakshi
Sakshi News home page

స్థలం రూ.200 కోట్లు.. భవనం రూ.20 కోట్లు

Published Tue, Dec 25 2018 8:55 AM | Last Updated on Tue, Dec 25 2018 8:55 AM

New Building Construction For OU Alumni - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఇంజినీరింగ్‌ అలూమ్ని అసోసియేషన్‌కు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలంలో కొత్త భవనం నిర్మాణం కోసం వీసీ ప్రొ.రాంచంద్రం ఇటీవల శంకుస్థాపన చేశారు. దేశ విదేశాల్లో స్థిరపడిన ఓయూ ఇంజినీరింగ్‌ పూర్వ విద్యార్థులు దాదాపు రూ.20 కోట్ల నిధులను సేకరించి అధ్యాపకులు, విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’ భవనం నిర్మాణం  చేపట్టనున్నారు.

కేవలం 10వేల మంది పూర్వ విద్యార్థులున్న ఇంజినీరింగ్‌ కళాశాల అలూమ్నికి రూ.200 కోట్ల విలువైన వర్సిటీ భూమి కేటాయించడం చర్చనీయాశంగా మారింది. కేవలం రూ.20 కోట్లతో నిర్మించనున్న భవనం కోసం ఏకంగా రూ.200 కోట్ల భూమి ఎలా కేటాయిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కోట్లు విలువైన భూమిలో కొత్త భవనం నిర్మించే బదులు... గతంలో నిర్మించిన భవనాల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చని సూచిస్తున్నారు. గత పదేళ్లుగా ఓయూలో కోట్ల రూపాయాలతో అనేక కొత్త భవనాలను నిర్మించారు. అవి పూర్తిగా వినియోగంలో లేవు. లా కాలేజీ ఎదుట సెంట్రల్‌ ఫెసిటిలిటీస్‌ భవనం, ఇంజినీరింగ్‌ కళాశాల లైబ్రరీ పక్కన ట్రైనింగ్‌ సెంటర్‌ బిల్డింగ్, సీ గ్రౌండ్స్‌ పక్కన సైన్స్‌ బిల్డింగ్, దూరవిద్య తరగతుల భవనం తదితర కొత్త భవనాలు పూర్తిగా వినియోగంలో లేవు. కొన్ని భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. 

సేవలో చురుగ్గా...  
విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో పదేళ్ల క్రితం ఓయూ పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. అయితే మిగతా కళాశాలల పూర్వ విద్యార్థుల కంటే ఇంజినీరింగ్‌ విద్యార్థులు అనేక కార్యక్ర మాలు చేసి ఓయూ అభివృద్ధిలో ముందజలో ఉ న్నారు. దీంతో ఇంజినీరింగ్‌ పూర్వ విద్యార్థులే ప్ర త్యేక అలూమ్ని అసోసియేషన్‌ ఏర్పాటు చేసి వి వి« ద కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటి వ ర కు రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. 

మరోవైపు...  
పూర్వ విద్యార్థులు ఓయూను ఒక వైపు నుంచే చూస్తున్నారు. ప్రస్తుతం ఓయూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితి. హాస్టల్‌ మెస్‌ బిల్లులు, వివిధ కోర్సుల ఫీజులు సైతం చెల్లించలేని దుస్థితిలో ఓయూ విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. దాతలు సహాయం అందిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోపక్క అధ్యాపకులు, ఉద్యోగుల కొరత ఉంది. విద్యార్థులకు హాస్టల్‌ గదుల సమస్య ఉంది. లేడీస్‌ హాస్టల్‌లో గదుల కొరతతో పాటు స్నానాల గదులు, మరుగుదొడ్ల సమస్య, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. 1200 మంది అధ్యాపకులు ఉండాల్సిన ఓయూలో 526 మంది మాత్రమే పని చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పర్మినెంట్‌ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఓయూకు ఎవరు సహాయం చేయడం లేదు. పూర్వ విద్యార్థులు సైతం భవనాలు, మౌలిక వసతులపై మాత్రమే దృష్టిసారించారు. ఓయూలో ప్రస్తుతం చదవుతున్న విద్యార్థులకు చేయుతనివ్వడం లేదు.  చాలామంది ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు తీసుకుపోలేదు. ఒక్క ఆర్ట్స్‌ కళాశాలలోనే మూడు బీర్వాల నిండా సర్టిఫికెట్లు ఉన్నాయని ప్రిన్సిపల్‌ తెలిపారు.  

టెక్విఫ్‌ నిధులతోనే...  
నిజానికి ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలల అభివృద్ధికి మూడు విడతలుగా కోట్ల రూపాయాల నిధులు టెక్విఫ్‌ ద్వారా లభించాయి. టెక్విఫ్‌ నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు కూడా టెక్విఫ్‌ నిధులతోనే పనులు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement