
పూజిత కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు
సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా నందిగామకు చెందిన యువతి పూజిత మృతి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా నందిగామకు చెందిన యువతి పూజిత మృతి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కనుగొన్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. పూజిత ఫేస్బుక్ అకౌంట్లో ఛాటింగ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనికోసం ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం నుంచి మొత్తం డేటాను తెప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్ట ఐఏఎస్ కాలనీలో గతనెల 20న యువతి పూజిత సజీవ దహనమైన సంగతి తెలిసిందే.
అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజితను అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, యువతి హైదరాబాద్ బయలుదేరే ముందు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలుత పూజిత మృతి సమాచారం తెలియగానే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, ఆమె తండ్రి శ్రీనివాసరావు ఆ తర్వాతి పరిణామాలను బట్టి ఈ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి వుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూజిత బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజిత స్నేహితుడుగా చెబుతున్న అక్షయ్, బీహార్ రాష్ట్రంలోని పోలీసు అధికారి కుమారుడు కావడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఎవరూ గమనించక పోవటమేమిటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూజిత శరీరం పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శరీరం ఆ స్థాయిలో తగులబడుతుందా అనేది మరో అనుమానంగా ఉంది.