
ఇఫ్తార్, సహర్ సమయాన్ని సూచించే కేలెండర్
సాక్షి సిటీబ్యూరో: రంజాన్ మాసం అంటేనే గుర్తుకొచ్చేది ఉపవాస దీక్ష. నెలరోజుల పాటు నిష్టగక్షీ దీక్ష చేసి రంజాన్ పండుగ జరుపుకుంటారు. అయితే దీక్షా కాలంలో సహెర్, ఇఫ్తార్ సమయాలు ముందుగానే నిర్ణయిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పుడైతే ఏ సమయంలో సహర్, ఏ సమయంలో ఇఫ్తార్ అనేది కేలెండర్లు ముద్రిస్తున్నారు. వందల సంవత్సరాలనుంచి ఈ దీక్షను ముస్లింలు పాటిస్తున్నారు. మరి ఇంత టెక్నాలజీ లేని కాలంలో ఎలా పాటించేవారో అనే విషయం ఆసక్తికరం. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ హసే ఈ సమయానికి సంబంధించిన పట్టికను రూపొందించారు. దీనిని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. అనేక సంవత్సరాల క్రితం సహర్– ఇఫ్తార్ సమయాలు సరిగా తెలియకపోవడంతో వివిధ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సహర్, ఇఫ్తార్ çసమయ నిర్ధారణ లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గ్రహించిన ఉస్మానియా ధార్మిక విభాగం ఉపవాస దీక్షకు సంబంధించిన పట్టికు రూపొందించాలని నిర్ణయించారు. ఉస్మానియాలో రూపొందించిన మీయారుల్ అవుకాత్ ( సమయ నిర్ధారణ ) పుస్తకం అధారంగానే నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో ఉపవాసాల సమయం నిర్ధారిస్తారు.
పదేళ్లపాటు వివరాల సేకరణ
భూమి చుట్టూ చంద్రుడు తిరిగే సమయం, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే రోజులు, సమయంతో పాట వివిధ కాలల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలను వివిధ దేశాలకు వెళ్లి అక్కడి సమయాలను దాదాపు పదేళ్లపాటు సేకరించారు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ హసే. ఈ వివరాలను క్రోడీకరించి తొలసారిగా 1930లో ఉపవాసదీక్షకు సంబంధించిన కేలెండర్ను రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉపవాసాల సమయం నిర్ధారణ కోసం 290 పేజీలతో ఉపవాస సమయ పట్టికను తయారు చేశారు. పుస్తాకాన్ని మియారుల్ అవుకాత్ అంటారు. నేటికీ ఉస్మానియా అనువాద విభాగంలో ఇది ఉంది. ఇప్పటికీ ఈ పుస్తకం అధారంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉనవాస సమయాలు ఆయా దేశాల్లో నిర్ధారిస్తారు. అబ్దుల్ వాసే రూపొందిన మియారుల్ అవుకాత్ అధారంగా 1938 నుంచి ఉపవాస పట్టిక తయారు చేయడం ప్రాంభించారు. గతంలోఉపవాస ప్రారంభ, విరమణ సమయాల్లో ప్రజలకు తెలపడానికి తూటాలు పెల్చివారు.
1970 నుంచి ప్రచురణ...
1970 నుంచి ఉపవాస దీక్షకు సంబంధించిన కేలెండర్ను ప్రచురించడం మొదలుపెట్టారు. అప్పటినుంచీ దానికి ఆదరణ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దిన, వార, మాస పత్రికల్లో రంజాన్ మాసానికి ముందే ఉపవాస పట్టికను ప్రచురించే వారు. 1994 నుంచి అన్ని హంగులతో మల్టీ కలర్లో ప్రింట్ చేస్తున్నారు. ప్రస్తుతం చెత్త బజార్ మార్కెట్లోనే ప్రచురించి రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలకు తీసుకెళుతారు. ఈ సంవత్సరం దాదాపు 5 రకాల మోడళ్లలో 10 కోట్ల కార్డులో ప్రచురించారు.