
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించడంపై కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. భట్టికి సీఎల్పీ పదవి ఇవ్వడం మంచి నిర్ణయమని, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మరోసారి రుజువైందని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉంటే దళితుడు సీఎం అయ్యేవాడని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలనీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కూమార్ రెడ్డి అసమర్థుడని విమర్శించారు. సీఎల్పీ కోసం ఉత్తమ్ పాకులాడారనీ, ఎన్నికల్లో ఓటమికి కారణమైన ఆయన వెంటనే రాజీనామా చేయాలని సర్వే డిమాండ్ చేశారు. ఉత్తమ్ నాయకత్వాన్ని నమ్ముకుంటే లోక్సభ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని, ఆయనను తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతుకుతుందని వ్యాఖ్యానించారు.