
సాక్షి, జగిత్యాల: అకారణంగా తన తండ్రిని పోలీసులు వేధిస్తున్నారని మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం ఆరపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రాజారెడ్డిని మెట్పల్లి ఎస్సై అశోక్ ఓ కేసు విచారణ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో.. ఆయన కుమారుడు దశరథ్ రెడ్డి(25) మనస్తాపానికి గురై ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఓ భూ వివాదం నేపథ్యంలో ఎస్సై అశోక్ వేధింపులకు గురి చేస్తుండటంతో.. ఆ కుటుంబంలో గత కొన్ని రోజులు మనశ్శాంతి కురువైంది. ఈ క్రమంలో శనివారం రాత్రి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దశరథ్ రెడ్డి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దశరథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఆగ్రహించిన అతని బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో మెట్పల్లి-కోరుట్ల మధ్య గల 63వ నెంబర్ జాతీయ రహదరిపై రాస్తారోకో నిర్వహించారు. దీనికి కారణమైన ఎస్సైని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.