
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టీటీడీపీ ధర్నా
హైదరాబాద్ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ తెలంగాణ టీడీపీ సోమవారం గన్పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కారే కారణమని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. కరెంట్ కోతలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కార్ సహకరించకపోవటం వల్లే సీసీఐ, పత్తిని కొనుగోలు చేయలేకపోతోందన్నారు.
మొక్కజొన్నలను కొనుగోలు చేయటంలో మార్క్ఫెడ్ విఫలం అయ్యిందని ఎర్రబెల్లి విమర్శించారు. వరికి కూడా మద్దతు ధర లభించటం లేదన్నారు. మార్కెట్ యార్డ్లో రైతుల కష్టాలను పరిష్కరించటంలో మంత్రి హరీష్ రావు విఫలమయ్యారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎకరానికి రూ.30వేలు చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.