
టైలర్ మహారాజా..! భారీ నగదు, బంగారం
చండీఘడ్: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అక్రమ నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. పంజాబ్ రాష్ట్రంలో కూడా అక్రమ లావాదేవీలు భారీగానే చోటు చేసుకుంటున్న ఘటనలు నమోదువుతున్నాయి. తాజాగా ఈడీ చండీఘడ్ లో ప్రముఖ టైలర్ యజమాని వద్ద భారీ ఎత్తున కొత్త నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. మొహాలీలోని బిజినెస్ సెంటర్ లో జరుగుతున్న అక్రమ లావాదేవీలపై కన్నేసిన ఈడీ అధికారులు 30 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల విలువ గల రెండు వేల రూపాయల నోట్లు, మిగిలినవి 100, 50 రూపాయల నోట్లుగా గుర్తించినట్టు తెలిపారు.
పంజాబ్ చండీగఢ్ లోని మొహాలీ 22 సెక్టార్ మహారాజా టైలర్ ప్రాంగణంలో అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈడీ దాడులు చేపట్టింది. చండీగడ్ మొహాలీలోని ప్రయివేటు బ్యాంకు సీనియర్ ఉద్యోగి పెద్ద ఎత్తున నగదు మార్పిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. టైలర్ దగ్గర పట్టుబడ్డ నగదు, బంగారం చూసి విస్తుపోయారు.
డీమానిటైజేషన్ తరువాత టైలరింగ్ షాప్ యజమాని 10 గ్రాముల బంగారం 44,000 వేల రూ చొప్పున 2.5 కిలోల బంగారం కొనుగోలు చేశాడు. విచారణలో భాగంగా షాప్ బిల్లు పుస్తకాల పరిశీలనలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు బంగారం ఏ దుకాణంలో కొనుగోలు చేసింది, నగదు మార్పిడి తదితర అంశాలపై విచారణ మొదలుపెట్టారు. కాగా పెద్ద నోట్ల రద్దుతర్వాత ఇటీవల మొహాలీ లోని దుకాణాల్లో కమిషన్ పద్ధతిలో నగదు మార్పిడికి పాల్పడుతున్న ఓ సీనియర్ బ్యాంకు ఉద్యోగిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఓ వస్త్ర వ్యాపారినుంచి రూ.2.19 కోట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.