
డీమోనిటైజేషన్.. ప్చ్!
వాషింగ్టన్: భారత్లో అవినీతి అంతానికి, ఆర్థిక వ్యవస్థ పురోగతికి నోట్ల రద్దు తోడ్పడకపోవచ్చని ప్రముఖ పాత్రికేయుడు ఆడమ్ రాబర్ట్స్ అన్నారు. అయితే సాహసోపేత, కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని ఈ నిర్ణయంతో స్పష్టమవుతోందని తెలిపారు. ‘ఎకనామిస్ట్’ పత్రికకు ఆగ్నేయాసియా రిపోర్టర్గా పనిచేస్తున్న సమయంలో అడమ్ సుమారు ఆరేళ్లు భారత్లో ఉన్నారు. తన పుస్తకం ’సూపర్ఫాస్ట్ ప్రైమ్ టైమ్ అల్టిమేట్ నేషన్: ది రిలెంట్లెస్ ఇన్వెన్షన్ ఆఫ్ మాడ్రన్ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఓ ప్రశ్నకు బదులిస్తూ... అవినీతిని అరికట్టడంలో నోట్ల రద్దు నిర్ణయం విజయవంతమైందన్న వాదనతో ఆయన విభేదించారు. అవినీతిని అరికట్టి, సమర్థంగా పాలించడంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ విజయవంతమయ్యారని, కేందంలోనూ అలాగే చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం భారత్లో ఏ రాజకీయ నాయకుడు కూడా మోదీని సవాల్చేసే స్థితిలో లేరని చెప్పారు. అధికారం చేపట్టాలనే దృఢమైన కోరిక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో లోపించిందని, కాంగ్రెస్కు ఓ మంచి నాయకుడు వచ్చే వరకు మోదీకి తిరుగులేదని అన్నారు.