
ఆ 17 కులాలకు సీఎం శుభవార్త!
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కులంకార్డును తెరపైకి తెచ్చారు. గతకొంతకాలంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్న సీఎం అఖిలేశ్ తాజాగా 17 ఇతర వెనుకబడిన (ఓబీసీ) కులాలను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రతిపాదనను త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపనుందని, కేంద్రం ఆమోదం తెలిపితే.. ఆయా కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించనుందని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ ఓటర్లకు గాలం వేసేందుకే అఖిలేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.
కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, బహర్, ప్రజాపతి, రాజ్భర్, బథాం, గౌర్, తురా, మఝీ, మల్హా, ధీమర్, మచౌ తదితర 17 ఓబీసీ ఉప కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి 2013 మార్చిలో అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయా 17 కులాల స్థితిగతులపై యూపీ ఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సమగ్ర అధ్యయనం జరిపిందని, వాటికి ఎస్సీ జాబితాలో చేరే అర్హత ఉందని ఈ తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది.