జియో కొత్త సర్వీసులు.. ఈ ఏడాది తర్వాతనే
టెలికాం రంగంలో సంచలనాలు సష్టిస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఈ ఏడాది తర్వాత మరో ఎత్తుగడకు ప్లాన్ చేస్తోంది. సొంత యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులను ఈ ఏడాది తర్వాత ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. రిలయన్స్ జియో క్యాబ్స్గా వీటిని నామకరణం చేయనుందట. ఏప్రిల్ లోనే లాంచ్ చేద్దామనుకున్న ఈ సర్వీసులను మరికొన్ని నెలలు ఆలస్యంగా కమర్షియల్గా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుందని ఫాక్టర్ డైలీ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ సర్వీసులను ప్రారంభించేందుకు ఇప్పటికే కంపెనీ మహింద్రా, హ్యుందాయ్ వంటి వాటితో సంప్రదింపులు చేస్తుందని తెలుస్తోంది. 600 కార్లను కూడా ఆర్డర్ చేసిందట.
తొలుత బెంగళూరు, చెన్నైలో వీటిని ప్రారంభించి, అనంతరం ఈ సర్వీసులను ఢిల్లీ, ముంబాయిలకు విస్తరిస్తుందని ఫాక్టర్ డైలీ పేర్కొంది. అదేసమయంలో చిన్న మార్కెట్లలో కూడా తన సర్వీసులను ప్రారంభిస్తుందట. జియో ఇటీవలనే టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో కష్టమర్లు ఇకపై ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా చెల్లింపులు జరుపుకునేలా ఈ భాగస్వామ్యం సహకరించనుంది. టెలికాం రంగంలో ఉచిత ఆఫర్లతో దూసుకెళ్తున్న జియో తన కస్టమర్ల బేసిస్ను కూడా 10 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది.