
సీఎం ఇంటివద్ద పేలుళ్లు.. 20మంది మృతి!
లాహోర్: పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. లాహోర్లోని పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో సోమవారం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 20మంది చనిపోగా, 30మంది గాయపడ్డారు. పోలీసులు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని, ఇది ఆత్మాహుతి పేలుడు అని లాహోర్ పోలీసు చీఫ్ కప్టెన్ ఆర్ అమిన్ తెలిపారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు.
పంజాబ్ సీఎం, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ పేలుడు జరగడం గమనార్హం. షాబాజ్ నివాసానికి సమీపంలో ఉన్న ఆర్ఫా కరీం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్లోని రద్దీ మార్కెట్లో పేలుడు జరిగింది. ఈ ఉగ్రదాడా? కాదా? అన్నది నిర్ధారించలేదు. ఏ గ్రూప్ కూడా తమదే బాధ్యత అని ప్రకటించలేదు. పేలుడు జరిగిన ప్రాంతంలో స్థానిక మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపడుతున్నది. ఈ సమయంలోనే పేలుడు జరగడంతో భారీ అగ్నిప్రమాదం కూడా చోటుచేసుకుంది. సమీపంలోని పలు భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.