
తెలంగాణ అసెంబ్లీలో 'నయీం' ప్రకంపనలు?
- సోమవారం అసెంబ్లీలో చర్చకు నిర్ణయం
- వాడీవేడి చర్చ జరిగే అవకాశం
హైదరాబాద్: కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్, అనంతర పరిణామాలు తెలంగాణలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డ నయీంకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెరవెనుక సంబంధాలు ఉన్నట్టు.. అతని ఎన్కౌంటర్ తర్వాత వెలుగుచూసింది. అధికార టీఆర్ఎస్ నాయకులతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. నయీంతో పలువురు నాయకులు అంగకాగి.. భూ దందాలు చేసినట్టు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో సిట్ చేపడుతున్న దర్యాప్తులోనూ నయీంతో రాజకీయ నాయకులతో సంబంధాలపై పలు ఆధారాలు లభించినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ అసెంబ్లీలో నయీం అంశంపై కీలక చర్చ జరగబోతున్నది. ఈ చర్చ సందర్భంగా నయీంతో సంబంధాల విషయంలో అధికార-ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో సభ దద్దరిల్లే అవకాశముందని భావిస్తున్నారు.