
పదే పదే మైక్ కట్ చేశారు...
అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది అధికార పక్షం. సంతాప తీర్మానాల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది.
హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది అధికార పక్షం. సంతాప తీర్మానాల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. సోమవారం ఉదయం తొమ్మిదిన్నరకు సభ ప్రారంభమైన వెంటనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత గోదావరి పుష్కర మృతులపై అసెంబ్లీ తీర్మానం చేసింది.
దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు మాట్లాడే అవకాశమే కల్పించలేదు. ఆయన మాట్లాడుతుంటే పదే పదే మైక్ కట్ చేశారు. మధ్యలో శానససభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి అచ్నెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అడ్డు తగిలారు. విపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా అధికార పార్టీ తీరు సాగింది. వైఎస్ జగన్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతొ వైఎస్ జగన్ మాట్లాడకుండానే... గోదావరి పుష్కర మృతులకు అసెంబ్లీ సంతాప తీర్మానం చేసింది. అటు ప్రత్యేక హోదా కోసం చనిపోయిన వారిపై పెట్టిన తీర్మానాన్ని ప్రతిపక్ష నేత మాట్లాడకుండానే సభ ఆమోదించింది. ప్రత్యేక హోదా మృతులపై చేసిన తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే మాట్లాడారు. అంతేకాకుండా ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని చంద్రబాబు హెచ్చరికలు చేశారు. మీరిలాగే మాట్లాడితే... మేం ఏం చేయాలో...అది చేస్తాం అంటూ అసహనం వ్యక్తం చేశారు.