Emmiganuru
-
ఎమ్మిగనూరు సభ.. సీఎం జగన్ ప్రసంగంలో హైలైట్స్
సాక్షి, కర్నూలు: పేదలు, మహిళల కష్టాల్లో నుంచే ప్రభుత్వ పథకాలు పుట్టుకొచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు సభలో ఆయన మాట్లాడుతూ, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని.. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ సిలబస్ తీసుకొచ్చామని చెప్పారు. అమ్మ ఒడి, విద్యాదీవెన ద్వారా పిల్లలను ప్రొత్సహిస్తున్నామన్నారు. పిల్లల చదవు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. 66 లక్షల మందికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లు పేదల ఖాతాలకు బదిలీ చేశామన్నారు. ఇప్పుడు బడుల్లో జరుగుతున్న మార్పులు 16 ఏళ్ల తర్వాత మీ బిడ్డల భవిష్యత్తు కోసం చేసినవేనని చెప్పారు. కుటుంబాలు పేదరికం నుంచి బయటపడాలంటే క్వాలిటీ విద్యతోనే అది సాధ్యమన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. పథకాలు చూసిన ప్రజలు..మంచి చేసిన తమ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ మేం టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. బీఈడీ కూడా చేశాడు బాబు హయాంలో ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్ ఇచ్చాం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్కు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. సిద్ధమంటూ లేచే ప్రతి చేయి, ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని, మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది. జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. పెత్తందార్లను ఓడించేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?. పేదల సొంతింటి కలను నెరవేర్చాం. పేదల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మనదే ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం నేరుగా మీ ఇంటి దగ్గరకే పెన్షన్ అందిస్తున్నాం నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకే ఇచ్చాం చంద్రబాబు హయాంలో మహిళల ఖాతాల్లోకి డబ్బు వచ్చిందా? ప్రతిపక్షాలు మోసాలు, మాయలను నమ్ముకున్నాయి 2.5 కోట్ల మంది మహిళల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు రైతు అనుకూల, వ్యతిరేకుల మధ్య ఎన్నికలు ఇవి రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులను మోసం చేశారు -
24/7 ప్రజలకోసం ఆలోచించే వ్యక్తి సీఎం వైఎస్ జగన్
-
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ఎమ్మిగనూరులో తండ్రి.. హైదరాబాద్లో కొడుకు..
ఎమ్మిగనూరు రూరల్ (కర్నూలు జిల్లా): తండ్రి మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కుమాడురు మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు..ఎమ్మిగనూరు పట్టణం ఎస్ఎంటీ కాలనీకి చెందిన మాదేష్(65), బేబిలు రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వీరికి జగదీష్ (32) ఒక్కడే సంతానం. కొన్ని సంవత్సరాల క్రితం జగదీష్కు రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్లో సెంట్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే జగదీష్ గత నెల 25వ తేదీన ఎమ్మిగనూరుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కుమారుడికి ప్రమాదం జరిగినప్పటి నుంచి తండ్రి మాదేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. కుమారుడికి ఆపరేషన్ చేస్తుండడంతో హైదరాబాద్కు వెళ్లిన మాదేష్ భార్య బేబి విషయం తెలుసుకుని మధ్యాహ్నం ఎమ్మిగనూరుకు చేరుకుంది. తండ్రి అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తుండగా బీపీ, షుగర్ పెరిగి జగదీష్ మృతి చెందాడు. భర్త మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్తో భార్య రాధ ఒక్కటే ఎమ్మిగనూరు వచ్చింది. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందటంతో ఎమ్మిగనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: భర్తతో విడాకులు.. ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి.. -
హమ్మయ్యా.. బయటపడ్డాను..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంలో సోమవారం మాబుహుసేనికి చెందిన 30 అడుగుల నీరులేని పాడుబడ్డ బావిలో ప్రమాదశాత్తు ఓ వృషభం పడిపోయింది. గమనించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న ఇంచార్జ్ ఫైర్ ఆఫీసర్ ముత్తన్నగౌడ్, వెంకటేశ్వర్లు, రమేష్ నిచ్చెన సాయంతో బావిలో దిగి వృషభాన్ని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. నానా అవస్థలు పడి వృషభాన్ని బయటకు తీశారు. దీంతో గ్రామస్తులు వారిని అభినందించారు. -
అనుమానంతో పెళ్లైన ఐదు నెలలకే...
సాక్షి, ఎమ్మిగనూరురూరల్: వివాహం జరిగి ఐదు నెలలు కూడా కాలేదు...పెళ్లి ముచ్చట్లు తీరలేదు.. భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారింది... నిత్యం అనుమానిస్తూ హతమార్చాలనుకున్నాడు...నేను ఒక్కడినే చావను నిన్ను చంపి చస్తానంటుడేవాడు.. అన్నట్లుగానే అలాగే చేశాడు. ఆదివారం తెల్లవారుజామున భార్యను హత్యచేసి, తానూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం వగురూరు గ్రామానికి చెందిన నజీర్, దాదాబీలకు నలుగురు కుమారులు, వారిలో రెండో వాడు మహబుబ్బాషా. కొన్ని నెలల క్రితం గ్రామం నుంచి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ బోర్డు లైన్లో ఇంటిని అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. మహబూబ్ బాషా బీరువాలు తయారు చేసే షాప్లో పనిచేసేవాడు. కుమారుడికి పెళ్లి చేయాలని మహబూబ్ బాషా తండ్రి నజీర్ ఆదోని మండలం సంతకుడ్లూరు గ్రామానికి చెందిన ఉసేనిసాబ్, గౌసియాల కుమార్తె రజియా (20)తో పెళ్లి నిశ్చియించారు. ఈ ఏడాది మార్చి 14న పెళ్లి జరిపించారు. ఉసేన్సాబ్కు ఆరుగురు కుమార్తెలు కాగా.. రజియా చివరిది. పెళ్లి జరిగినప్పటి నుంచి మహబుబ్బాషా పనికి సరిగా వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేవాడు. పెళ్లి జరిగిన రెండు నెలలకే భార్య గర్భం దాల్చటంపై అనుమానం పెంచుకొని రోజు వేధించేవాడు. అయితే శుక్రవారం మహబూబ్ బాషా, రజియా వగురూరు దర్గాకు వెళ్లి పూజలు చేసుకొచ్చారు. శనివారం రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్న తరువాత భార్య,భర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త అనుమానంపై రజియా సీరియస్ కావటంతో సహనం కోల్పోయిన మహబూబ్ బాషా రజియా గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిందని తెలుసుకొని భయంతో బయటకు వచ్చాడు. బయట గదిలో ఉన్న తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించగా, నమాజ్కు వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చి, స్కూటర్లోని పెట్రోల్ బాటిల్లోకి తీసుకొని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలు తాళలేక కేకలు వేయటంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు తలుపు బద్దలు కొట్టి మంటలు ఆర్పివేశారు. అప్పటికే విగతజీవిగా ఉన్న రజియాను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మంటలు ఆర్పివేసి కుమారుడిని తాడుతో కట్టేసి పోలీస్లకు సమాచారం అందించారు. టౌన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ కె. శ్రీనివాసులు, ఏఎస్ఐ బందెనవాజ్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహబుబ్బాషాను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూల్కు తరలించారు. కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబ్ బాషాపై హత్యకేసు నమోదు చేశామని సీఐ వి. శ్రీధర్ తెలిపారు. -
మేమేం పాపం చేశాం తల్లీ..!
ఎమ్మిగనూరు రూరల్: పేద కుటుంబంలో వలస చిచ్చు పెట్టింది. ఉన్న ఊర్లో పనులు లేక..బతికే దారిలేక గ్రామం విడిచి వెళ్లే విషయంలో దంపతుల మధ్య గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదపురం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కురవ నరసింహులు, కురవ పద్మావతి దంపతులు. వీరికి మనోజ్ (4), సంజీవ్ (2) సంతానం. భార్యభర్తలు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనికి వేరే ఊరికి వలస వెళ్లే విషయంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై మంగళవారం వీరు గొడవపడ్డారు. ‘‘చిన్న పిల్లలు ఉన్నారు.. ఎండ ఎక్కువగా ఉంది..నేనొక్కడినే వలస వెళ్లి వస్తాను..మీరు ఇంటి దగ్గరే ఉండండి’’అని భార్యకు నరసింహులు చెప్పగా తాను కూడా ఇద్దరు పిల్లలతో కలిసి వస్తానని భర్తతో పద్మావతి చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి భార్యపై నరసింహులు చేయిచేసుకున్నాడు. మనస్తాపానికి గురైన పద్మావతి బుధవారం ఉదయం భర్త నరసింహులు బహిర్భూమికి వెళ్లగా క్షణికావేశంలో నిద్రిస్తున్న చిన్నారులపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఆపై తాను కూడా నిప్పంటించుకుంది. చిన్నారులను స్థానికులు 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పద్మావతికి స్వల్ప గాయాలయ్యాయి. పిల్లలు కట్టెల పొయ్యిలో పడ్డారని పద్మావతి పొంతన లేని మాటలు చెప్పడం గమనార్హం. చిన్నారుల శరీర భాగాలు ఎక్కువ శాతం కాలిపోవటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు కర్నూలుకు తరలించారు. మార్గమధ్యలో మనోజ్, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సంజీవ్ మృతి చెందారు.చిన్నారులను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు తీసుకురాగా..వైద్యులు రాకపోవటంతో కాంపౌండర్ వైద్యం చేశాడు. చిన్నారుల కాలిన గాయాలకు కూడా బర్నాల్ మందును కుటుంబసభ్యులతో తెప్పించారు. అరగంట పాటు చిన్నారుల శరీరానికి చల్లదనం ఇచ్చే వైద్యం అందించకుండా కేవలం తూతూమంత్రంగా ప్రథమ చికిత్సలు చేయించడం విమర్శలకు తావిచ్చింది. వైద్యులు ఏడు గంటలకు ఆస్పత్రికి వచ్చి చిన్నారులకు ప్రథమ చికిత్స చేశారు. -
కెపాసిటీ మించింది..విషాదం మిగిల్చింది.
సాక్షి, ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు: కొన్ని నిమిషాల్లో క్షేమంగా ఎమ్మిగనూరుకు చేరుకుంటాం అనుకుంటుండగానే మలుపు రూపంలో మృత్యువు ఆ చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఎమ్మిగనూరు సమీపంలో గురువారం మధ్నాహ్నం జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన మాల నరసింహులు, ఈరమ్మలకు అశ్విని(10), నందిని, ఉష, పవిత్ర(1) నలుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈరమ్మ తన పుట్టినిల్లు కర్ణాటకలోని సిరుగుప్పకు 12 రోజుల కిత్రం వెళ్లారు. గురువారం తన మెట్టినిల్లు కందనాతికి బయలుదేరారు. ఆదోనిలో బస్సు కోసం వేచి ఉండగా టాటా ఏసీ ఆటో ఎమ్మిగనూరుకు వెళ్తుండటంతో అందులో ఎక్కారు. వేగంగా వస్తున్న ఆటో.. నలందా బీఈడీ కాలేజీ మలుపు వద్ద అదుపు తప్పి డోర్ దగ్గర ఉన్న ఆశ్విని(10) కిందపడబోయింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు కుమార్తెను కిందపడకుండా పట్టుకోవటానికి ప్రయత్నించేలోపు మరో చిన్నారి పవిత్ర(1) కింద పడిపోయింది. క్షణాల్లో ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ అందులో ఉన్న వారిని కింద దింపి, గాయపడ్డ వారిని అటుగా వస్తున్న ఆటోలో ఎక్కించి, ఆదోని వైపు పరారయ్యాడు. ప్రమాదం హడావుడిలో ఉండటంతో చూసి తప్పించుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఆటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే కాకుండా.. పిల్లలకు డబ్బులు ఇవ్వరు అని సీట్లో కూర్చున్న వారిని నిల్చోపెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే ప్రమాదంలో తల్లి ఈరమ్మకు ఎడమ చెయ్యి విరిగిపోయింది. క్షణాల్లో కళ్లముందే తమ పిల్లలు దుర్మరణం చెందటంతో తల్లిదండ్రులు దుఃఖసారగంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పెద్దకడుబూరు ఎస్ఐ అశోక్ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును చిన్నారుల తండ్రి నరసింహులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని, ఆటో డ్రైవర్ను పట్టుకుంటామని పేర్కొన్నారు. -
ఓట్ల తొలగింపు కేసులు...తలలు పట్టుకుంటున్న పోలీసులు
సాక్షి, ఎమ్మిగనూరురూరల్: ఆన్లైన్లో ఓట్లు తొలగించాలని వచ్చిన దరఖాస్తులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రాంమూర్తి టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో మంగళవారం ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో ఎవరి పేరు చెప్పకపోవడంతో అయోమయానికి గురువుతున్నారు పోలీసులు. మూడు వేల ఓట్లు తొలగించాలని ఫారం–7 కింద దరఖాస్తులు వచ్చినట్లు ఫిర్యాదులో చెప్పడంతో టౌన్, రూరల్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే సంబంధం లేని వ్యక్తుల పేర్లపై ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు వారితో మాకు ఎటువంటి సంబంధం లేదని సంతకాలు కూడా చేయించుకున్నారు. విచారణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాకా బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలవడానికి తహసీల్దార్ కార్యాలయానికి టౌన్, రూరల్ ఎస్ఐలు కె.శ్రీనివాసులు, కె.రామస్బుయ్య, ఏఎస్ఐ శర్మ, పోలీస్సిబ్బందితో వచ్చారు. ఈ విషయంపై పోలీస్ అధికారులను అడగగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. -
నీళ్లింకని నేల
‘క్యాంప్ వెళ్ళే ముందు హాస్పటల్కు ఒకసారి వెళ్లి మీ నాన్నను పలుకరించి వెళ్ళండి. చాలా ఫీల్ అవుతా ఉన్నారు’’ అన్నది కవిత. ‘‘టైం ఎక్కడుంది. నేను చేస్తున్నది ప్రయివేటు కంపెనీలో. చూస్తూనే ఉన్నావుగా తీరికెక్కడ ఉంది? అన్నీ తెలిసీ నీవు అలా వేధించడం ఏమిటి?’’ విసుగుతో అన్నాడు సోమశేఖర్.‘‘అది కాదండి. నాన్నగారికి అవన్నీ తెలీవుగా. పని ఎప్పటికీ ఉన్నదే! కాస్తంత వీలు చూసుకుని వెళ్లి అలాగే వెళ్ళిపోండి. పది నిమిషాలు గడిపితే ఆయన సంతోషపడతారు’’ అర్థిస్తూ అన్నది కవిత. ‘‘నాకైనా వెళ్లాలని ఉండదా? నా పని ఒత్తిడి ఎవరూ అర్థం చేసుకోరు. ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. నియోజకవర్గాల వారిగా వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ అంట. ’’ అని నిష్టూర పోతూ అన్నాడు సోమశేఖర్.‘‘మీకు టైం లేకపోతే నేను ఎలాగూ వెళతాను కదా! మావయ్యతో చెబుతాలే అంది’’ కవిత. సోమశేఖర్ కొంత కోపం తగ్గించాడు.‘‘సర్లే చూస్తా! మేము ఎలాగూ కర్నూల్కు పోతావుండాము. కర్నూలుకు పోయే దార్లోనేగా హాస్పటల్. ఓ పది నిమిషాలు చూసి వెళతాలే.’’ అన్నాడు సోమశేఖర్ రాజీ ధోరణిలో.‘‘వెళితే బావుంటుందని, అంతకు మించి ఏమీ లేదు. పది గంటలకు క్యారేజీతో ఎలాగూ నేను వెళతానుగా’’ సర్ది చెబుతూ అంది కవిత. సోమశేఖర్ తన కొలీగ్ శివకు ఫోన్ చేశాడు. ‘‘శివా! నీవు ఆటో పట్టుకుని మెహదీపట్నం వచ్చేయ్! మానాన్న ఉన్న ఆస్పత్రి నీకు తెలుసు కదా, అక్కడకు వచ్చేయ్! నాన్న మాట్లాడాలని కలవరిస్తున్నాడంట. ఓ పది నిమిషాలు ఆయనతో మాట్లాడాలి. నీవు ఆటోలో రాగలిగితే నిన్ను పికప్ చేసుకునే సమయం మిగిలి అక్కడ గడపొచ్చు. ప్లీజ్’’ అని అభ్యర్థించాడు సోమశేఖర్. ‘‘అలాగే సర్! తప్పకుండా’’ అవతల వైపు నుండి శివ.సోమశేఖర్ హైదరాబాదులో ఒక ప్రయివేటు టివి ఛానల్లో పని చేస్తున్నాడు. నాన్న ఆంజనేయులు గవర్నమెంట్ టీచర్. అమ్మ గృహిణి. సోమశేఖర్కు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. నాన్నకు ఇటీవల హార్ట్ ప్రాబ్లెమ్ వలన ఆస్పత్రిలో చేర్చారు. నాన్నకు ఇ.హెచ్.ఎస్ ఉంది. పెన్షన్ వస్తోంది. ఆర్థికంగా నాన్న, అమ్మలు సోమ శేఖర్కు భారం కాదు కాని సమయమే వారి గురించి కేటాయించ లేకపొతున్నాడు. సోమశేఖర్ ఆస్పత్రిని చేరుకొని నాన్న రూమ్కు వెళ్ళాడు. అమ్మ నాన్నకు బ్రష్ చేయించినట్లుంది. నాన్న టవల్తో ముఖం తుడుచుకుంటున్నాడు . ‘‘ఎలా వుంది నాన్నా’’ అంటూ రూములోకి ప్రవేశించాడు సోమశేఖర్.‘‘బావుందిరా! మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారురా ’’ కొడుకు వచ్చాడన్న ఉత్సాహంతో అన్నాడు ఆంజినేయులు.‘‘అమ్మా! కవిత పది గంటల లోపు వస్తుందంట’’ అని అమ్మ సావిత్రమ్మతో సోమశేఖర్ అన్నారు. ‘‘అవున్రా ఫోన్ చేసి చెప్పింది. సోమశేఖర్ ఆస్పత్రికే బయలు దేరాడని చెప్పింది. మీ నాయన నీకోసమే ఎదురు చూస్తా ఉండాడు’’ అంది సావిత్రమ్మ.‘‘కాదుమా! ఈయప్ప నన్ని ఇంత టెన్షన్ పెడితే ఎట్టా! నాకేమి రాకూడదని ఉంటదా. నా తిప్పలు మీకేమి తెలుసు. ఇరవై రోజులైంది. ఒక్క రోజు రెస్ట్ లేకుండా దోకిస్తా ఉన్నారు. మా! నాను చేస్తా ఉండేది ప్రవేటు ఉద్యోగం. నాయనకు తెలియంది ఏముంది? సూడల్ల, సూడల్ల అని సతాయిస్తే ఎట్టా! ఈడొచ్చి నాతాన ఉండమంటే రారు. పల్లె ఇడిసి రామంటారు. పన్నెండు ఏండ్లు పనిచేసి దాన్నే ఈయప్ప సొంతూరుఅనుకుంటాండు. ఆడ మన తాతలు సంపాదించిన భూములేమన్న ఉన్నాయా?. నా తిప్పలు నాకైతే ఈయప్ప దొకటి’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు సోమశేఖర్. ‘‘సర్లేరా ! పోయిరాపో! ఏంటోరా నిన్ను సూడాలనిపిస్తాది. రావాలంటాను. అంతే’’ అన్నాడు ఆంజనేయులు నోచ్చుకొంటూ. ‘‘మా! ఇడ్లీ తీసుకొచ్చా. తినిపించు’’ అన్నాడు సోమశేఖర్. సావిత్రమ్మ ఆంజనేయులు ముందు ఇడ్లీ పెట్టింది. ఆంజనేయులు ఇడ్లీ తింటూ సోమశేఖర్ తో మాట్లాడసాగాడు. ‘‘క్యాంపు ఎక్కడికి పోతావున్నారా?’’ అని సోమశేఖర్ను ప్రశ్నించాడు ఆంజినేయులు. ‘‘ఏమ్మిగనూరుకు నాన్నా!’’ అని సోమశేఖర్ అనగానే ఒక్కసారిగా ఆంజనేయులు మొఖం వెలిగిపోయింది. తను ఉంటున్న ప్రాంతమే. ‘‘నాను ఈడకు వచ్చి వారం రోజులైంది. ధనుంజయ సారు నీకు తెలుసుకదా ? మొన్న రాత్రి బాత్రూములో కాలు జారి పడినాడంట. వాడి కొడకు ఫోన్ చేసి ఉండే. వీలైతే ఎమ్మిగనూరులో ధనుంజయ సార్ ను కలిసి రారా.’’ అంటుండగా ఒక్కసారిగా దగ్గు వచ్చింది. ఆ దగ్గుతొ నోట్లో నములుతున్న ముద్దగా వున్న ఇడ్లి తుంపరలుగా వచ్చి సోమశేఖర్ మీద పడింది. షర్టు పై పడిన ఇడ్లిను దులుపుకొంటూ ఒక్కసారిగా ఇంతెత్తు లేచాడు సోమశేఖర్. ‘‘తినేటప్పుడు మాట్లాడొద్దు అంటే ఇనిపించుకోవు. మా! ఇంతగూడా ఈయప్పకు బుద్దిరాల్యా! నేనే బుద్ది తక్కువై వచ్చా. మా! ఎట్లా ఎగుతావో ఏమో నాకు తెల్దు. నే పోతున్నా! నాల్గు దినాలు రాను సూడు! ఊరికే ఫోన్ చేసి సతాయించొద్దండి ‘‘ అంటూ విసవిస వెళ్ళిపోయాడు సోమశేఖర్.నాన్న కళ్ళ నుండి కన్నీరు చెంపలపైకి చేరింది. అమ్మ కొంగుతో కళ్ళు అద్దుకుంది. సోమశేఖర్ ఆస్పత్రి నుండి బయటకి రాగానే శివ స్కార్పియో దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ‘‘శివ ఎంత సేపయింది వచ్చి?’’ అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా ‘‘ పోదాం పదా’’ అన్నాడు సోమశేఖర్. ‘‘సరే సర్’’ అంటూ కదిలాడు శివ.డ్రైవర్ కాశన్న ‘‘సార్ ఎక్కడైనా టీ తాగుదాం?’’ అన్నాడు. సోమశేఖర్ ‘‘నేను కూడా టిఫిన్ చేయాలి. ఏదైనా హోటల్ ఉంటే ఆపు’’ అన్నాడు.‘‘అవునవును నేను కూడా దమ్ము కొట్టాలి’’ అన్నాడు శివ.స్కార్పియో ఒక డాబా ముందు ఆగింది. నలుగురూ దిగారు. సోమశేఖర్ టిఫిన్కు ఆర్డరిచ్చాడు . శివ, కాశన్నలు టీ కి ఆర్డరిచ్చి టేబుల్ ముందు కూర్చున్నారు. డ్రైవర్ కాశన్న పక్కటేబుల్ దగ్గర కూర్చుని టీ కోసం ఎదురు చూస్తున్నాడు. సోమశేఖర్ శివతో మాట కలుపుతూ...‘‘నా చదువంతా ఎమ్మిగనూరు చుట్టు పక్కల, ఎమ్మిగనూరులో సాగింది శివా! తర్వాత పీజిడియంసి యానిమేషన్ కోర్సులకై బెంగళూరు పోతిని. అది అయిపోయినాక ఈ ఛానల్లో చేరి ఇట్లా తిప్పలు పడుకుంటా ఉండా. రేపటి మన ప్రోగ్రామ్ ఎమ్మిగనూర్లో వుండేది. మనం కర్నూలు వెళ్లి అక్కడి నుంచి ఎమ్మిగనూరు వెళ్ళాలి. కర్నూలుకు డెబ్బై కి.మీ. దూరంలో ఉంటాది ఎమ్మిగనూరు. మా నాయన ఎమ్మిగనూరు దగ్గర్లోనే నాగలదిన్నె అనే ఊర్లో పన్నెండు ఏండ్లు టీచరుగా పని చేసి రిటైర్ అయినాడు. రిటైరైనాక కూడా ఆడనే ఉండాడు. హైదరాబాద్ రాకముందు నేను కూడా ఆడనే ఉండినాను. పదైదు దినాల కింద గుండెలో నొప్పి వస్తే హైదరాబాద్కు పిలిపించి ఆస్పత్రిలో చూపిస్తి. ఏం సమస్య లేదు. టాబ్లెట్స్ వాడాలన్నారు డాక్టర్లు. రోజూ తనతో ఆస్పత్రికి పోయి మాట్లాడాలంటాడు. మనకి అయితాదా? నీవే సూస్తుండావు కదా!!’’ అన్నాడు. ‘‘అవును సర్ ! మీ నాయన మిమ్ములను సూడాలని సతాయిస్తుండాడు. మా నాయన నన్ని సూడకుండా సతాయిస్తుండాడు. ఎప్పుడైనా నేనే ఫోన్ చేయాలి.నెల దినాలైనా చేయడు. ఫోన్చేస్తే ఎత్తడు. ఏమి నాయనోల్లో ఏమో! ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ’’ అంటూ శివ కాశన్న వైపు తిరిగి ‘‘ఏం కాశన్నా! అంతే గదా’’ అన్నాడు. ‘‘ఏమో సార్.. నాకైతే మా నాయన సిన్నప్పుడే సచ్చిపోయినాడంటా. మా యమ్మది సోమశేఖర్ సార్ వాళ్ళ నాయన కతే! మాది కూడా కర్నూలు దగ్గర నిడ్జూరు. ఇంటికాడ వొక్కతే ఉంటాదని ఫోన్ కొనిచ్చినాను. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తా ఉంటాది. మనకేమో ఈ ఫోన్ తీయడం కాదు.. ఈ ముసలోల్లతో వచ్చింది సావు’’ అన్నాడు కాశన్న.దాబాలో సప్లయర్ చినిగి పోయిన బనియన్ వేస్కొని బక్క పల్చగా ఉన్నాడు. కళ్ళు లోపలి పోయివున్నాయి. బహుశా రాత్రంతా మేల్కొని ఉన్నట్లున్నాడు. మొఖం పీక్క పోయిఉంది.వీళ్ళ సంభాషణ వింటున్న సప్లయర్ ‘‘సార్ మీరు కర్నూలుకు పోతున్నారా?’’ అని అడిగాడు. సోమశేఖర్ ‘‘అవును’’ అన్నాడు. ‘‘సార్ ఆ రోడ్డు మీద ఆయన్ను చూడండి !’’ అంటూ రోడ్డు వైపు చూపించాడు.పైకి కట్టుకున్న మాసిన లుంగీ, వారాలుగా ఉతకకున్న షర్టు, చిందరవందరగా ఉన్న జుట్టు, మాసిపోయిన గడ్డం, ఒక చేతిలో సంచి పట్టుకుని ఉండాడు. ఇంకొక చేతితో భుజంపైన కుండను పట్టుకుని ఉండాడు. కుండకు పాత గుడ్డ కట్టి దాని చుట్టూ సన్నని తాడు కట్టి వుంది. చేతిలోని సంచిలో వంట గిన్నెలు ఉన్నట్లున్నాయి.కదిలినపుడంతా లోపలి గిన్నెలు శబ్దాలు చేస్తున్నాయి.సోమశేఖర్ ఆసక్తిగా ‘‘ ఎవరు అతను? పోతున్న బండ్లన్నిటిని ఆపమని అడుగుతున్నట్లున్నాడు’’ అని అడిగాడు. ‘‘సార్. ఎక్కడినుండి నడుచుకుంటూ వచ్చాడో తెలియదు. పొద్దుటి నుండి కర్నూలు వైపు పోయే వెహికల్స్ను ఆపి కర్నూలుకు వస్తా .. అని అడుగుతావుండాడు. ఏ వెహికల్ ఆగడం లేదు. ఒకటి రెండు జీపులు ఆగినాయి. ఇతను నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. వాళ్ళు ఎగాదిగా చూసి వెళ్ళిపోతున్నారు. పాపం అనిపిస్తా వుంది సార్. నేనే బన్ను టీ తీసుకు పోయి తినమంటే వద్దు అన్నాడు. మీకు పుణ్యం వుంటాది. మీ బండి వెనక సీటు ఖాళీగున్నట్లు ఉంది. కొంచెం ఎక్కించుకుని పొండి సార్. నాకే బాధ అయితా ఉంది’’ అని అర్థించాడు.కర్నూలు అనే పేరు వినగానే సోమశేఖర్ అయితే ‘‘పిలు అతడిని’’ అన్నాడు. సప్లయర్ పరిగెత్తుకుంటూ ఆ మనిషి దగ్గరికి వెళ్లి గట్టిగా ‘‘సారోల్లు కర్నూలుకు పోతుండారంట. బండి ఎక్కమన్నారు. పో .. బండి ఎక్కు’’ అని చెప్పాడు.‘‘నా దగ్గర దుడ్లు లేవు అని సెప్పినావా?’’ అని అనుమానంగా అడిగాడు అతను.‘‘చెప్పినా లే! రా.. ముందు నీవు ఎక్కి కూర్సో’’ అంటూ సప్లయర్ బండి వెనకాల డోర్ తీశాడు. అతను కుండను జాగ్రత్తగా పట్టుకుని సీటు మీద పెట్టి లోపలి ఎక్కాడు. సప్లయర్ సంచిని తీసి అందించాడు. గళ గళ శబ్దం చేస్తున్న సంచిలోంచి సత్తు గ్లాసులు రెండు కింద పడినాయి. సప్లయర్ వాటిని తీసి సంచిలోకి వేసి సంచిని అతనికి అందించగా అతను సంచిని లోపలి తీసుకున్నాడు. అతను సీటు పైన కూర్చుని పైన గుడ్డను కట్టిన కుండను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. సోమశేఖర్, శివలు వచ్చి బండి ఎక్కారు. డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు. టైం పదిన్నర. శివ ముందు సీట్లో, సోమశేఖర్ మద్య సీట్లో కూర్చున్నారు.శివ వెనకాల కూర్చున్న వ్యక్తిని చూస్తూ, ‘‘టీ తాగాల్సింది’’ అని పలకరింపుగా అన్నాడు . ‘‘ వొద్దు సారూ’’ అన్నాడతను. ‘‘ఏముంది ఆ కుండలో అంత భద్రంగా ఒళ్లో పెట్టుకుని కూసుండావు. కోడిపెట్ట తన పిల్లల్ని రెక్కలకింద జాగ్రత్తగా అదిమి పెట్టుకొన్నట్లు’’ అని అతణ్ణి ప్రశ్నించాడు. అతను ఏమి పలకలేదు. చూపులు ఎదుటి కిటికీ నుండి బయటకు చూస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచం లోనే లేడన్నట్లుగాఉన్నాడు.‘‘ఏం సామీ ఏం పలకకున్నావు. కొంపదీసి ఆ కుండలో నిధి ఏమీ లేదు గదా! మేమేం అడగంలే. ఏముండాది ఆ కుండలో.. ఏమి సేప్పకున్నావు’’ అన్నాడు శివ.తనను గాదేమో అన్నట్లు అవే చూపులు. సోమశేఖర్ ‘‘వదిలేయ్ శివా! అతన్తో మనకెందుకు’’ అన్నాడు.బండి ఫోర్ లైనర్లో పోతా ఉంది. ఆలంపూరు చౌరస్తా వచ్చింది. టైం ఒకటిన్నర.శివ ‘‘సార్ భోం చేద్దామా?’’ అని అదిగాడు.సోమశేఖర్ ‘‘సరే పద! కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు పోయే దారిలో హోటళ్ళు కూడా ఏమీ లేవు. ఇక్కడే తినిపోదాం’’ అన్నాడు.డ్రైవర్ దాబాను చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు.వెనకాలతను ‘‘సార్! ఎమ్మిగనూరుకు పోతారా?’’ అని అడిగాడు.సోమశేఖర్ ‘‘అవును. నీవు కర్నూలు వరకే కదా!’’ అని అడిగాడు.‘‘సార్ నాదీ ఎమ్మిగనూరు దగ్గరే! గువ్వలదొడ్డి. కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు పోయే రోడ్డులో ఎర్రకోట వస్తాది. ఆటికి మావూరు ఒక మైలు వుంటాది. నాను ఆడ దిగుతా సార్!. మీకు పుణ్యం ఉంటాది. ఆడ ఆపండి సారూ!’’ అని వేడుకున్నాడు.సోమశేఖర్ ‘‘నీది గువ్వలదొడ్డినా ? అవున్లే .. ఎర్రకోట నుండి పోతారు గదా? .. సర్లే దింపుతాంలే ‘‘ అని అన్నాడు. డ్రైవర్ ఆలంపూరు ఫ్లై ఓవర్ దాటిన తరువాత ఒక డాబా వద్ద బండి ఆపాడు.అందరూ దిగారు. సోమశేఖర్ బండి వెనకాల కూర్చున్న వ్యక్తీ వైపు తిరిగి ‘‘నీ పేరేమన్నావ్!’’ అని ప్రశ్నించాడు. అతను శక్తినంతా కూడగట్టుకుని తడి ఆరిపొయిన పెదవులను నాలుకతో తడిచేసుకొంటూ ‘‘గిడ్డయ్య సారూ’’ అని చెప్పాడు.\‘‘దిగు గిడ్డయ్యా ! .. అన్నం తిందువు కాని’’ అన్నాడు.గిడ్డయ్య ‘‘వద్దులే సారూ..’’ అని అన్నాడు.‘‘డబ్బులు మేమిస్తాంలే ! నీవేం ఇవ్వొద్దు.. పోద్దట్నించి ఏమి తినలేదంట కదా! ఆ డాబాలో సప్లయర్ చెప్పాడు. తిందురా. ఆ కుండ సీటు మీద పెట్టు. నీ నిధిని ఎవ్వరూ ఎత్తుక పొర్లే .. రా..’’ అని అడిగాడు. ‘‘వొద్దులే సారూ.. నాకి ఆకలి లేదు. మీరు తిని రండి.. నాను ఈడనే కూసోని ఉంటాను’’ అన్నాడు.‘‘నీ ఖర్మ! మేం ఏమీ చేయలేము. మేం తినొస్తాం. అయితే ఈడనే వుండు’’ అంటూ సోమశేఖర్ బండి దిగాడు.ముగ్గురూ వెళ్లి అరగంటలో తిని వచ్చారు. బండి మరలా బయలు దేరింది.తన బాల్యం ఎమ్మిగనూరు ప్రాంతంలో సాగడం వలన గిడ్డయ్య మౌనం అనేక అనుమానాలు కలిగిస్తా ఉంది. ఏమి తినలే. ఏమీ తాగలే. ప్రతీదీ వద్దంటాడు. గిడ్డయ్యది ఎమ్మిగనూరు ప్రాంతమే. ఎందుకో సోమశేఖర్కు గిడ్డయ్యతో మాట్లాడాలని ఉంది. తనూ అదే ప్రాంతం వాడు కావడం వలన ప్రాంతీయ అభిమానంకావచ్చు.సోమశేఖర్ ‘‘గిడ్డయ్యా! గువ్వలదొడ్డి అన్నావ్ కదా! హైదరాబాద్ ఎందుకొచ్చావు?’’ అని ప్రశ్నించాడు. ‘‘సారూ... ! బతకనీక వొచ్చింటిమి’’ అంటూ నీరసంగా మాట్లాడడం ప్రారంభించాడు గిడ్డయ్య.‘‘మా నాయన పేరు ఉళ్ళక్కి, మాయమ్మ సోమక్క. మాకి మూడు ఎకరాలు వరిమడి ఉండ్య. మాకి బాయి ఉండ్య. మా వూరికి కాల్వ ఉండ్య. ఎండా కాలం కాల్వ నీళ్ళు పారుతా ఉండ్య. వానా కాలం వానకే వడ్లు పండిస్తాంటిమి. మానాయన మోటతో (కపిల) నీళ్ళు పారిస్తా ఉండ్య. మా నాయన నన్ని సదువిడిపిచ్చి సేని పనికి పిలుసుక పోబట్ట్యా! మూడు ఎకరాలు వరిమడి పెట్టుకొని మనకి సదువెంటికిలే? అంటాండ్య. నాను కూడా బడి ఇడిసి పెట్టి మానాయనతో కల్సి సేనికి పోతాంటి సార్. నాయన మెత్తగాయ. మాయమ్మ మెత్తగాయ. నాకి పెండ్లి సేసిరి. బాయి ఎండిపాయ. మోట మూలాన పడ్య. సేను బీడు అయిపాయ. మానాయన ఎప్పుడు సూసినా నా కొడుకుని సదవొద్దని వాని గొంతు గోసిడిస్తిని అని పలమతాండ్య. ఇంట్ల తిండికి జరగక పాయే. ఇంగ ఇట్ల కాదని నాను నా పెండ్లాం హైదరాబాద్ కి బతకనీక వస్తిమి. సెడి పట్నం సేరాలనేర్య పెద్దలు. అట్లా వచ్చిడిస్తిమి సారూ. రోవొన్ని దినాలు మట్టి పనికి పోతిమి. నా పెండ్లాముకి బరువులుమోసి మోకాళ్ళ నొప్పులు రాబట్య. మట్టి పని చేయాల్యాక పాయ. నాను మట్టి పనికి పోతుంటే తాను గుడిసె కాడనే వుంటుండ్యా. ఇంగ ఇట్లా కాదని పక్క గుడిసె ముసిలోళ్ళు డంప్ యార్డుకాడికి ఇనుప ముక్కలేరుకోనీక్య పోతుంటే తానూ కూడా పోబట్య. ఇనుప ముక్కలు ఏరుకొని గుజిరీకి అమ్ముతుండ్య . దినామూ నూరు, నూటాయావై రూపాయలోస్తాండ్య. ఒక దినుము నాకు ప్రాణం బాగా ల్యాక కొట్టంకాడ ఉంటి. పక్క కొట్టం ముసిలోల్లతో కలిసి దినుమూ మాదిరే ఇనుము ముక్కలేరుకోనేకి డంప్యార్డు కాటికి పాయే. పైటాలప్పుడు ముసిలోల్లు ఉరుక్కుంట మా గుడిసె కాటికొచ్చి గిడ్డయ్యా! నీ పెండ్లాం మీద అంటబెట్టిన చెత్త పడిడిసేద్య. ఆయమ్మ దాంట్లోనే మునిగి పోయ. బెరీన రా ! అన్రి. నాను ఉరుక్కుంటూ పోతి. పెద్ద దిబ్బ పైన కాలుతుంటే నా పెండ్లాము కింద ఉండేనట. అదికాలి కాసి కిందకి పొర్లి పడిపోయేద్య.నాను ఏడ్సుకుంట కసువు తీసేసేకి సూస్తిని. ఆడున్నోల్లు పట్టుకునిడిసిరి. నాను ఏడ్సుకుంట ఏమి సేతురా దేవుడా అనుకుంటా ఉంటి. అదేదో టీవి లోన సెప్పిరంట. ప్రోక్లయిను వచ్చి నుగ్గ తవ్వి సూసేగాని ఆయమ్మ మాత్రము దొరకల్యా! డ్రైవోరు నాదగ్గరున్న వేయి రూపాయలూ డిజిల్ కని తీసుకోనిడిస్య! అందురూ అగ్గిలో బూడిదై పోయింటాది అనబట్రి. నా పెండ్లాముని ఎట్లన్న తీసియండి. అయమ్మ పీనిగినన్న తీస్కోని వూరికి పోతా! మా నాయనకి మా యమ్మకి నాను మొగమెట్ల సూపియ్యాలంటి. వాళ్ళే అంత గుంపు కట్టుకుని కూసున్న కాడ బూడిదని తీసిరి. పీనిగి దొరకల్యా! ఎముకలు దొరికితే అవే ఆయమ్మవని ఈ కుండల పెట్టిచ్చిరి. ఈ కుండలో సచ్చిపోయిన నా పెండ్లాము ఎముకలుండాయి. మన్ను చేసేకి మా ఊరికి తీసకపోతున్నా. మా యత్తకి, మామకి నా నేమని సెప్పాల! మాము నామదార్లం. మన్ను అయ్యేంత వరకు ఏమీ ముట్టము సారూ. దానికే నాను టీ నీళ్ళు కూడా తాగ కుండా ఉండేది. పుణ్యాత్ములు మీరు నాకి దొరికితిరి. ఎట్లన్నా గాని ఎర్రకోట కాడ దింపండి సారూ’’ అంటూ కన్నీరు పెట్టుకొన్నాడు గిడ్డయ్య. సోమశేఖరుకు నోట మాట రాలేదు. కళ్ళలో అందరకూ నీళ్ళు తొణికిస లాడాయి. తన చిన్నతనంలో ఎమ్మిగనూరులో చుట్టూ ఎక్కడ చూసినా నీళ్ళుఉండేవి. ఆ నీళ్లన్నీ ఎక్కడికి పోయాయి...? తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ క్రింద వేసవి కాలములో గూడ నీళ్ళు వచ్చేవి. ఈ కాలువ క్రింద పండే పొలాలలో పని చేయడానికి ఎంతోమంది ఆస్పరి, దేవనకొండ, తుగ్గలి వంటి ప్రాంతాలనుండి సుగ్గికి వచ్చేవారు. తను వదలిపెట్టిన పన్నెండు ఏళ్ళలోనే ఎంత మార్పు వచ్చింది కదా అని ఆలోచిస్తూ ఉండగా గిడ్డయ్యా, ‘‘సారూ ఆడ కనిపించేదే ఎర్రగోట. ఊరుముందే ఆపండి. నాను దిగుతాను’’ అని సంచి చేతిలోకి తీసుకుంటూ అన్నాడు గిడ్డయ్య.రోడ్డు పక్కన స్కార్పియో ఆపారు. డ్రైవర్ కాశన్న దిగి వెనకాల వచ్చి డోరు తీశాడు. సంచిని చేతిలోకి తీసుకొని సామాన్లు కింద పెట్టాడు. గిడ్డయ్య కుండని గుండెలకు హత్తుకుని జాగ్రత్తగా కిందకు దిగి ‘‘సారూ! శానా సాయం సేస్తిరి. సచ్చి మీ కడుపున పుడతాను తండ్రీ! మీరు మడసంగా పోయి రాండి ’’ అంటూ కుండను భుజం మీద పెట్టుకుని సత్తు గిన్నెల సంచిని చేత పట్టుకుని మట్టి రోడ్డు వైపు బయలు దేరాడు.కాశన్న బండి ఎక్కి ముందుకు పోనిచ్చాడు. అందరూ గంభీరంగా ఉన్నారు. సోమశేఖర్ కల్పించుకుని ‘‘కాశాన్నా! బండి తిప్పు! గిడ్డయ్యను వారూర్లో దింపోద్దాం. పోద్దన్నుంచి ఏమి తినలే. తాగలే.ఎడనన్న పడిపోతే కష్టం. మనకి గిడ్డయ్యకి ఎదో ఋణాణుబంధం ఉంది. పోయోద్దాం పా... మన ప్రోగ్రాం ఎట్లా రేపు 11 గం’’లకు. ఊర్లో ఇదిసివద్దాం పా..’’ అన్నాడు. ‘‘నాకూ అదే అనిపించింది సర్ !’’ అన్నాడు కాశన్న శివ కూడా వదిలి పెట్టి రావడమే మంచిది అన్నాడు. కాశన్న బండి తిప్పుకొని గువ్వల దొడ్డి మట్టి రోడ్డు ఎక్కించాడు. గిడ్డయ్య పక్కన బండి ఆపారు. కాశన్నదిగి గిడ్డయ్య చేతిలో సంచి తీసుకొని వెనకాల డోరు తెరచి ‘‘కూసుందురా గిడ్డయ్యా’’ అన్నాడు. ‘‘ఏంటికొస్తిరి సారూ. నానే పోతాంటి కదా’’ అన్నాడు గిడ్డయ్య ఇబ్బంది పెట్టడం ఎందుకనుకొంటూ. కాని కాశన్న గిడ్డయ్యకు ఆ అవకాశం ఇవ్వలేదు.‘‘ఎంత మంచోళ్ళు సారూ మీరు’’ అనుకుంటూ గిడ్డయ్య కుండను జాగ్రత్తగా పట్టుకుని బండి ఎక్కాడు. ‘‘సార్ మా సేను ఊరికి పోయే రాస్తాలోనే ఉంటాది. ఊర్ల మట్టి మిద్దె పడిపోయినాక మా నాయన, మాయమ్మ సేన్లోనే కొట్టం వేసుకుని ఉండారు. సేను బీడైనా మా నాయన నాసావు ఈ సేన్లోనే అనికాసి సేన్లోనే వుండాడు. ఉర్లోనికి పని లేదు సారూ. వూరి బయట్నే మా సేను. కొట్టం కాడ ఆపండి.’’ అని కోరాడు గిడ్డయ్య .మట్టి రోడ్డుపై దుమ్ము లేపుతా బండి పోతా ఉంది. రోడ్డు పై ఒక్కరూ కూడా కనిపించకున్నారు. కనుసూపు మేర బీడు పడిన పొలాలే కన్పిస్తాండాయి.‘‘సారూ ఈడ ఆపండి’’ అన్నాడు గిడ్డయ్య. కాశన్న వెనుకకు వచ్చి డోరు తీశాడు. గిడ్డయ్య కిందకు దిగాడు. కొట్టం ముందర రోడ్డుపైన జీపు ఆగే సరికి గిడ్డయ్య వాళ్ళ నాయన బయటకు వచ్చి గిడ్డయ్యను చూశాడు.‘‘ఓరే గిడ్డీగా ! ఏంరా జీపుల వస్తివి’’ అన్నాడు ఆందోళనగా. ‘‘నాయనా ఇంకేముంది.. నాయనా.. నీ క్వాళ్ళి (కోడలు) సచ్చిపోతే ఈ కుండల తెస్తిని నాయనా !’’ అని ఏడ్సుకుంటూ గిడ్డయ్య వాళ్ళ నాన్నకి ఎదురుపోయాడు. గిడ్డయ్య మాటలు విన్న సోమక్క గుండెలు బాదుకుంటూ బయటికి వచ్చి పాడి పాడి ఏడ్వడం ప్రారంభించింది. ఉళ్ళక్కి ఏడ్సుకుంటానే మంచం వేశాడు. గిడ్డయ్య అతి కష్టం మీద జరిగిన విషయాన్ని తన తల్లి దండ్రులకు చెప్పాడు. కుండను మంచం మీద జాగ్రత్తగా పెట్టాడు. కాశన్న, సోమశేఖర్, శివలు ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. వాళ్ళను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. సోమశేఖర్ గిడ్డయ్య భుజంపై చేయి వేసి ‘‘ఊర్లోకి పోయి మీ వాళ్ళ నెవరినైనా పిలుచుకురావాల్నా?’’ అని అడిగాడు.ఉళ్ళక్కి ఏడ్చుకుంటూనే ‘‘వూర్ల ఎవరూ లేరు నాయనా. ఊర్ల వుండేదంతా ముసిలోల్లే. అందరూ సుగ్గికి పోయేర్య. నా క్వాళ్ళి అమ్మ నాయనోల్లు గూడ ఈడ లేరు.బెంగ్లూరు పోఏర్య. నా క్వాళ్ళిని ఈడే మా సేనులోనే మట్టి చేస్తాం’’ అన్నాడు.కాశన్న, శివ కొట్టంలోకి పోయి గడ్డపార, సలికే వెతికి తీసుకొచ్చారు. ఏడ గుంతతవ్వాలో సోమక్కను అడిగారు. వారు చూపించిన చోట కాశన్న, శివలు తవ్వుతుండగా సోమశేఖర్ మట్టి దూరంగా వేస్తూ ఉన్నాడు. తవ్వడం పూర్తయింది. గిడ్డయ్య, ఉళ్ళక్కి, సోమక్కలు కుండని జాగ్రత్తగా తెచ్చి గుంతలో పెట్టారు. అందరూ ఏడ్చు కుంటూనే మట్టి కప్పారు. ‘‘యానాటి రుణమో సారూ..! మీ పుణ్యాన నా క్వాళ్ళి (కోడలు) గుర్తులన్న వూరికి తెచ్చి ఇస్తిరి. నాయనా మీకు చేతులెత్తి మొక్కలా’’ అన్నాడు కళ్ళు టవల్తో తూడ్చుకొంటూ ఉళ్ళక్కి. గిడ్డయ్యకు, ఉళ్ళక్కికు, సోమక్కకు ధైర్యంగా ఉండండని చెబుతూ ముగ్గురూ బరువెక్కిన హృదయాలతో బండి దగ్గరకు వచ్చి బయలు దేరారు.చేతులకు మట్టి అంటుకొని వుంది. బట్టలు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి.ముగ్గురూ ఏమీ మాట్లాడుకోలేక పోతున్నారు. దేని గురించీ ఆలోచించే స్థితిలో లేరు. ఒక రకమైన వైరాగ్యములో వున్నారు అందరూ. ఎమ్మిగనూరులో ప్రవేశిస్తున్నప్పటికి తొమ్మిది గంటలు కావొస్తోంది. సోమశేఖర్ ‘‘కాశన్న ! వూరి బయటనే ఏదన్నా హోటలు ఉంటే ఆపు కాళ్ళు, చేతులు కడుక్కొని ఏదైనా తిని ఒకేసారి ఎమ్మిగనూరులోకి వెళ్లిపోదాం’’ అన్నాడు. స్కార్పియో ఒక హోటల్ ముందు ఆగింది. అందరూ అప్రయత్నంగా బండి దిగారు. సోమశేఖరుకు గిడ్డయ్యనే గుర్తుకొస్తున్నాడు. తన భార్య శవం దొరకక పోయినప్పటికీ అమెవో కాదో తెలియని ఆ ఎముకలను ఆ కుండలో వేసుకుని గుండెలకు హత్తుకుని తన ప్రాణంగా భావించి ఎంత అపురూపంగా దానిని తన భార్య శవంగా భావిస్తూ, తినకుండా, తాగకుండా, కింద పెట్టకుండా.. ఎంత గాఢమైన ప్రేమ! తను ఎందుకు నాన్నపట్ల అంత నిర్దయగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నాడు. నాన్న గుర్తుకు రాగానే కంట్లో నీళ్ళు ఆగ కున్నాయి. శివ వాళ్ళ నాన్న తో, కాశన్న వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ వున్నారు. సోమశేఖర్ ను హోటల్ లోని సప్లయర్ ఆర్డరు అడుగుతున్నా వినిపించు కోకుండా నాన్నతో ఫోన్లో ఉద్వేగంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే గుండె బరువు తగ్గినట్లు అనిపించింది. వాళ్ళు ముగ్గురూ కాళ్ళు, చేతులు కడుక్కుంటూ ఉంటే సోమశేఖర్ కు తన మనసుకు అంటిన మురికిని కడుగుతున్నట్లుగా అనిపించింది. మిగిలిన ఇద్దరికీ కూడా బహుశా ! - మారుతి పౌరోహితం -
ఏటీఎంలో రూ.17 లక్షలు చోరీ
-
ఏటీఎంలో రూ.20 లక్షలు చోరీ
ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో గురువారం వేకువజామున చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి రూ. 20 లక్షలు దోచుకెళ్ళినట్లు అధికారులు వెల్లడించారు. చోరీ సమయంలో సీసీ కెమెరా పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎంలో చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. -
రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
-
మున్సిపల్ కార్యాలయం రణరంగం
- షాపు టెండర్ వేసే విషయంలో ఇరు వర్గాల ఘర్షణ – ఆర్వో కార్యాలయం ధ్వంసం – 18కు టెండర్ వాయిదా ఎమ్మిగనూరు: స్థానిక మున్సిపల్ కార్యాలయం రణరంగమైంది. ఓ షాపు టెండర్ కోసం ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. అడ్డుగా వచ్చిన వారిని తరిమి తరిమికొట్టారు. టెండర్లు నిర్వహించే ఆర్వో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పూర్తి వివరాలు.. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలోని షాపు నెం. డి–7కు శుక్రవారం టెండర్లు నిర్వహించారు. ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వుడ్ చేసిన ఈ షాపునకు గతంలో రూ. 2లక్షలు గుడ్విల్ కింద టెండర్లు పిలువగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రూ.లక్ష గుడ్విల్గా రూ. 4వేలు అద్దెగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. అధికార పార్టీలోని అదే సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు తమ వాళ్లతో టెండర్ వేసేందుకు వచ్చాడు. అదే సమయంలో మరో వ్యక్తి చెన్నా బసవ (చిన్నా), మున్సిపల్ మాజీ చైర్మన్ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని వెంట పెట్టుకొని టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చారు. అధికార పార్టీలో మేమున్నాం.. స్థానికంగా ఎరుకల కులంలో ఉన్న వారు కాదని అగ్రవర్ణాల బినామీగా ఎలా టెండర్ వేస్తావు అని అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో చిన్నాను చితకబాదారు. చిన్నాకు మద్దతుగా వచ్చిన మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కడి నుంచి జారుకున్నారు. తరువాత చిన్నాకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎరుకల ఈరన్న, నాగన్నలు రంగప్రవేశం చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల ఘర్షణలో మున్సిపల్ ఆర్వో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. చివరకు కమిషనర్ సంపత్కుమార్, ఆర్వో నాసర్లు షాపు టెండర్ వేలాన్ని 2017 జనవరి 18కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఇరు వర్గాలు వెనుదిరిగారు. ప్రశాంతంగా ఉన్న సామాజిక వర్గంలో గుడ్విల్ కోసం అధికార పార్టీ నేతలు, ఇటు మున్సిపల్ మాజీ చైర్మన్లు గొడవ పెట్టి వేడుక చూశారని ఎరుకల కులస్తులు ఆవేదన చెందారు. మున్సిపల్ అధికారులు జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వంట..మంట!
ఎమ్మిగనూరు టౌన్: అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల మార్పునకు విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీస్తోంది. పాత ఏజెన్సీలు హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా, అనుమతించ వద్దంటూ కొందరు అధికార పార్టీ నాయకులు హుకుం జారీ చేస్తుండటంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. సోమవారం రెండు వంట ఏజెన్సీల మధ్య చెలరేగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని 31 పాఠశాలల్లో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీలను రద్దు చేయాలంటూ అధికార పార్టీ నాయకులు ఆ పథకం త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తెచ్చారు. విషయాన్ని పసిగట్టిన ఐదు పాఠశాలల ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు జూలై 3న స్టే విధించింది. అయితే హైకోర్టు స్టేను అధికారులు లేక్క చేయలేదు. త్రిసభ్య కమిటీలోని ఎంఈఓ, ఎంపీడీఓలు పట్టణంలోని 31 ఏజెన్సీలను రద్దు చేసినట్లు ఉత్తర్వులను ఈనెల 12న ఆయా పాఠశాలల హెచ్ఎంలకు పంపారు. కాని త్రిసభ్య కమిటీలో సభ్యుడైన తహశీల్దార్ సంతకం పెట్టేందుకు నిరాకరించినా ఉత్తర్వులను మాత్రం హెచ్ఎంలకు పంపడం గమనార్హం. -
ప్లాస్టిక్ను నిషేధించాలి
ఎమ్మిగనూరు టౌన్ : ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ బుధవారం ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో కస్తూరి కాన్సెప్ట్ స్కూల్, బాలికల హైస్కూల్ విద్యార్ధినీ, విద్యార్థులు పురవీధుల గూండా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లితుందని, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను బహిష్కరించాలని నినదించారు. అనంతరం సోమప్ప సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది లక్ష్మీనారాయణ, బసిరెడ్డి, సూర్యనారాయణ, బందెనవాజ్, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రమీలారాణి, పట్టణ సమైక్య కార్యదర్శి హేమలత, విద్యార్థినీ, విద్యార్థులు, పొదుపు మహిళలు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తండ్రి అనారోగ్యం కారణంగా తనయుడికి టికెట్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు శాసనసభ స్థానంను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కుమారుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డికి కేటాయించింది. ఈ స్థానం నుంచి మళ్లీ చెన్నకేశవరెడ్డే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే చెన్నకేశవరెడ్డికి అనారోగ్యం కారణంగా తనయుడు జగన్మోహన్రెడ్డికి ఈ స్థానాన్ని కేటాయించారు. ఎమ్మిగనూరు శాసన సభా స్థానానికి గతంలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రకోట చెన్న కేశవరెడ్డి 20,103 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా ఆయన మూడవ సారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం తరపున బివి మోహనరెడ్డి పోటీ చేశారు. -
ఆస్తి పన్ను చెల్లింపు ఇక ఆన్లైన్లో!
సాక్షి, కర్నూలు: పురపాలక సంఘాల్లో ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. కార్యాలయాలకు వెళ్లి క్యూలలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఈ ప్రక్రియ రూపుదిద్దుకుంది. మొదట ఆస్తి పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించినా.. త్వరలోనే తాగునీటి బిల్లులనూ ఆన్లైన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. తద్వారా సేవలు సులభతరం కానుండగా.. సిబ్బంది చేతివాటానికీ తెరపడనుంది. నూతన విధానాన్ని పురపాలక శాఖ మంత్రి మహీధర్రెడ్డి గత శనివారం నాంది పలకగా.. జిల్లాలోనూ అదే రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్తో పాటు డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు పురపాలక సంఘాలు ఉన్నాయి. నివాస, వాణిజ్య భవనాల నుంచి ఆస్తి పన్ను రూపంలో కర్నూలులో రూ.28 కోట్లు, నంద్యాలలో రూ.7 కోట్లు, ఆదోనిలో రూ.3.5 కోట్లు, ఎమ్మిగనూరులో రూ.1.48 కోట్లు, డోన్లో రూ.81.52 లక్షలు, నందికొట్కూరులో రూ.45 లక్షలు, ఆళ్లగడ్డలో రూ.44 లక్షల దాకా వసూలు కావాల్సి ఉంది. పన్నులను ఆరు నెలలకోసారి చెల్లించాల్సి ఉండగా.. ప్రజలు సకాలంలో స్పందించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. అదేవిధంగా కార్యాలయాల వద్దకు వెళ్లి చెల్లించడం కష్టతరమవుతోంది. మొండి బకాయిల కోసం బిల్ కలెక్టర్లు వీటి కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నా ప్రయోజనం లేకపోతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ సౌకర్యంతో పన్నుల చెల్లింపు మెరగయ్యే అవకాశం ఉంటుందని పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు పీవీవీఎస్ మూర్తి తెలిపారు. పన్నులను www.cdma.gov.in వెబ్సైట్లోకి వెళ్లి చెల్లించాల్సి ఉంది. అసెస్మెంట్ నంబర్ను యజమాని పేరు, ఇంటి నంబర్ నమోదుతో తెలుసుకునే వీలు కల్పించారు. ఇదే సమయంలో ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేసేందుకు వీలుగా పురపాలక సంఘాలకు అవసరమైన హ్యండ్ మిషన్లను యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సమకూర్చనున్నాయి. ఆన్లైన్లో డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పన్ను చెల్లిస్తే 0.65 శాతం, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అయితే రూ. 3 చొప్పున రుసుము వసూలు చేయనున్నారు. ఇదిలాఉండగా పురపాలక సంఘాల సంస్కరణ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో మూడున్నరేళ్లుగా ప్రత్యేక పాలన సాగుతోంది. ఫలితంగా కర్నూలు కార్పొరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు మృగ్యమయ్యా యి. మరోవైపు బాకాయిలు పేరుకుపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పన్నుల వసూలును వేగవంతం చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే ఆన్లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. -
పోలీసుల అదపులో మైత్రిఫైనాన్స్ యజమానులు
ఎమ్మిగనూరు: మైత్రి ఫైనాన్స్ చైర్మన్ మాధవరెడ్డి, డైరెక్టర్లు కొండారెడ్డి, మాల్యాద్రిలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ కంపెనీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలను వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న బాధితులు ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయవద్దని బాధితులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులకు, బాధితులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. వారిని అరెస్ట్ చేస్తే జైలుకు వెళతారు తప్ప తమకు న్యాయం జరగదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వారం రోజుల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన ఖాసిం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కంపెనీ అధిపతులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు ఎంతమేర ప్రజాధనం కొల్లగొట్టారో విచారించవలసి ఉందని వారు చెప్పారు. -
సమైక్యాంధ్ర కోసం పోస్టుకార్డుల ఉద్యమం
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర కోసం పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. బుధవారం వివిధ పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, సోనియాగాంధీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డులను పంపారు. కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉరుకుందు, కె.శ్రీనివాసులు, మహానందయ్య, మహాదేవప్ప పాల్గొన్నారు.