
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులకు తెలియజేశారు. ఈ సమావేశానికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలను 29వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సాధారణ పరిపాలన(కేబినెట్) విభాగానికి పంపించాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.
త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై మంత్రి మండలిలో చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.