
టీడీపీ హయాంలో పట్టణాలు, నగరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–అర్బన్(పీఎంఏవై–యూ) పథకం కింద మంజూరై నిర్మాణాలు మొదలవ్వని, పునాది దశ కూడా పూర్తి చేసుకోని ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది.
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో పట్టణాలు, నగరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–అర్బన్(పీఎంఏవై–యూ) పథకం కింద మంజూరై నిర్మాణాలు మొదలవ్వని, పునాది దశ కూడా పూర్తి చేసుకోని ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. పీఎంఏవై–వైఎస్సార్ (అర్బన్) పథకం కింద 20,403 ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు.
ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు తొలి దశ కార్యక్రమంలో భాగంగా వీటి నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఒక్కో ఇంటికి పీఎంఏవై–వైఎస్సార్(అర్బన్) పథకం కింద ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేయనుంది. మొత్తం 20,403 ఇళ్లలో 2016–17కి సంబంధించి 2,529 ఇళ్లు, 2017–18కి సంబంధించి 7,465, 2018–19కి సంబంధించి 10,409 ఇళ్లున్నాయి.