
సాక్షి, విశాఖపట్నం : మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరికి వరద నీటి ముప్పు వాటిల్లింది. ఆ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని గోస్తని వరద నీరు పోటెత్తింది. వివరాలు.. అల్లూరి సీతారామరాజు జన్మించిన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి మరోసారి వరదనీటి ముప్పు ఏర్పడింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాండ్రంగి గ్రామానికి ఆనుకుని ప్రవహించే గోస్తనీ నది మూడు రోజులుగా ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో మండల కేంద్రం పద్మనాభం, రేవిడి,మద్ది, విజయనగరం తదితర ప్రాంతాలకు మార్గాలు మూసుకుపోయాయి. దీంతోపాటు గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి వరద నీరు పోటెత్తడంతో వెళ్లడానికి వీలులేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కాగా ఇటీవలే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాండ్రంగి వంతెన నిర్మాణానికి రూ.14 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒకవేళ భారీ వర్షాలు లేకపోయుంటే ఈ వారమే ఆ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ భావించారు. కాగా దశాబ్దాలుగా ఇదే ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసినా గంటా శ్రీనివాసరావు హామీ నెరవేర్చడంలో విఫలం కాగా సీఎం జగన్ మాత్రం వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.