
సాక్షి, విజయవాడ: నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శ౦కర్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన తాగునీరు, పారిశుద్ద్యం పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ఆహారం, వాటర్ ఫ్యాకెట్లు తక్షణమే సరాఫరా చేయాలన్నారు. ఓహెచ్ఎస్, చేతి పంపులు శుభ్రం చేయించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేసి పంపాలని గిరిజా శ౦కర్ ఆదేశించారు. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష)
నివర్ తుపాను రాగల ఆరు గంటల్లో తీవ్ర వాయు గుండం.. ఆ తదుపరి ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ప్రభావిత ప్రాంత ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివర్ తుపాన్: ఏపీలో వర్ష బీభత్సం..)