సర్కారు బడి.. తల్లిదండ్రుల మమేకంతో..సరికొత్త ఒరవడి | Parents teachers meeting for the welfare of children | Sakshi
Sakshi News home page

సర్కారు బడి.. తల్లిదండ్రుల మమేకంతో..సరికొత్త ఒరవడి

Aug 11 2023 5:30 AM | Updated on Aug 11 2023 10:44 AM

Parents teachers meeting for the welfare of children - Sakshi

కాకినాడ జిల్లా వాకతిప్ప ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఉపాధ్యాయుడు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు సమకూరుస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. బోధనలోనూ అత్యాధునిక పద్ధతులతో విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో స్కూళ్ల తీరుతెన్నులనే మార్చేసింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి, తరగతిలో వారి పరిస్థితిని తల్లిదండ్రులు తెసుకునేందుకు పేరెంట్‌ – టీచర్స్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పేరెంట్‌–టీచర్స్‌ సమావేశాలు విజయవంతమయ్యాయి.

ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ అనంతరం పిల్లల ప్రగతిని తల్లిండ్రులకు వివరించేందుకు గురువారం 45,219 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలు జరిగాయి. రెండురోజుల క్రితమే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పనులను సైతం పక్కనబెట్టి పాఠశాలలకు వచ్చారు. మొదటి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది తల్లిదండ్రులు హాజరై బడిలో వారి పిల్లల ప్రగతిని స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం వారి పిల్లల కోసం చేస్తున్న మంచిని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు 30 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గూడేల నుంచి తల్లిదండ్రులు హాజరవడం.. పిల్లల మేలు కోసం తల్లిదండ్రులు పడుతున్న తపనకు అద్దం పట్టింది.

పూర్తి స్నేహపూరిత వాతావరణంలో జరిగిన ఈ సమావేశాల్లో విద్యార్థులు చదువులో రాణిస్తున్న వైనాన్ని, పాఠశాలల్లో కలి్పంచిన సౌకర్యాలను, విద్యా విషయక మార్పులను, సాధించిన పురోగతిని ఉపాధ్యాయులు తల్లిండ్రులకు వివరించారు. ఇంటి వద్ద పిల్లలు ఎలా మసలుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఫార్మాటివ్, సమ్మెటివ్‌ అసెస్‌మెంట్స్‌ అనంతరం పేరెంట్స్‌–టీచర్స్‌ సమావేశాలు ఉంటాయని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఇలాంటి సమావేశాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇవి తమ బాధ్యతను మరింత పెంచిందని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ బడుల్లో ఎన్ని మార్పులు వచ్చాయో స్వయంగా చూశామని, ఈ పథకాలు, సమావేశాలు కొనసాగించాలని కోరారు. 

ఇంత బాగుంటుందని అనుకోలేదు 
మా అమ్మాయి భవా­ని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇక్కడ ఎలా ఉంటుందో, ఏం తింటుందో అని బెంగగా ఉండేది. మా ఊరు దూరమైనా బిడ్డ బాగుకోసం వచ్చాను. ఇక్కడ సౌకర్యాలన్నీ  బాగున్నాయి. ఎలా చదువు చెబుతున్నారో చెప్పారు. పిల్లలను బాగా చూసుకుంటున్నారు. ఈ సమావేశం లేకపోతే ఈ విషయాలు తెలిసేది కాదు. ఇది చాలా మంచి కార్యక్రమం.      – కొర్ర తిలో, నిమ్మపాడు, చింతపల్లి మండలం 

ఎలా చదువుతుందో తెలుసుకున్నా 
నాతవరం మండలం గునుపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మా అమ్మాయి ఆశ్రిత ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల మీటింగ్‌లో ఫార్మెటివ్‌ పరీక్ష ఫలితాలను మాకు తెలియజేశారు. మా పిల్లలు ఎలా చదువుతున్నారో చెప్పారు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ స్కూల్లో ఇలాంటి సమావేశాలు జరగలేదు. ఇప్పుడు మా బాధ్యత ఏంటో తెలిసింది. పిల్లలు కూడా జాగ్రత్తగా చదువుతారు. ఈ సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి.
 – సాంబారు గోవింద, గునుపూడి, అనకాపల్లి జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement