
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్లో ప్రకటించిన ఆస్తి పన్నుపై ఐదు శాతం తగ్గింపు అవకాశాన్ని పుర ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కంటే 55 శాతం అధికంగా పన్ను చెల్లించినట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని, ఇందులో వార్డు సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. పలు దఫాలుగా ఆస్తి పన్ను చెల్లింపులపై సమీక్షలు నిర్వహించామన్నారు. దాంతో పన్ను చెల్లింపులు గత సంవత్సరం వసూలైన రూ.320.13 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది గడువు ముగిసే సమయానికి 55 శాతం అధికంగా రూ.496.51 కోట్లు వసూలైందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ వివరించారు.