![Unprecedented popularity of the bus trip in the western region of Kurnool district - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/03/30/ys%20anna.jpg.webp?itok=D5bZls6G)
మూడో రోజు 108 కి.మీ. యాత్ర
కర్నూలు (సెంట్రల్): మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 108 కిలోమీటర్ల మేర సాగింది.
శుక్రవారం ఉదయం 10.35 గంటలకు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడులో రాత్రి బస చేసిన శిబిరం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర పత్తికొండ మండలం రాతన వరకు కొనసాగింది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తిగా రాత్రి వేళ సాగినా ప్రజలు వైఎస్ జగన్ రాక కోసం నిరీక్షించారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దల నుంచిపిల్లల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మూడో రోజు యాత్ర సైడ్లైట్స్
♦ ఉదయం 9.30 గంటలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, డాక్టర్ జె.సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్రెడ్డి సీఎం వైఎస్ జగన్ను పెంచికలపాడు శిబిరంలో కలిశారు.
♦ 10.35 గంటలకు పెంచికలపాడులోని రాత్రి బస శిబిరం నుంచి సీఎం వైఎస్ జగన్ బయటకు వచ్చి బస్సు ఎక్కారు. అక్కడ భారీగా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు.
♦ 11.35 గంటలకు సీఎం జగన్ కోడుమూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.
♦ 11.38 గంటలకు సీఎంకు కోడుమూరులో చేనేతలు మగ్గం, నేసిన చీరను బహూకరించారు. గొర్రెల పెంపకందారులు గొర్రె పిల్లలను అందించి తమ అభిమానం చాటుకున్నారు.
♦ 11.45 గంటలకు కోడుమూరులో బుడగ జంగాలు తమకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా, వచ్చే ప్రభుత్వంలో ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎ జగన్ హామీ ఇచ్చారు.
♦ 12.20 గంటలకు కోడుమూరు మండలం వర్కూరుకు బస్సు యాత్ర చేరుకుంది.
♦మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం బస్సుయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగొండ్ల మండలం వేముగోడుకు చేరుకోగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా ఘన స్వాగతం పలికారు.
♦ 1.59 గంటలకు సీఎం జగన్ బస్సు యాత్ర గోనెగండ్ల చేరుకోగా, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు.
♦ 2.30 గంటలకు సీఎం జగన్ భోజన విరామం కోసం గోనెగండ్ల మండలం రాళ్లదొడ్డిలో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకున్నారు.
♦ సాయంత్రం 4 గంటలకు గోనెగండ్ల మండల మాజీ ఎంపీపీ కేవీ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరగా, ఆయనకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
♦ భోజన విరామం అనంతరం సాయంత్రం 4.30గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది.
♦ సాయంత్రం 5.45 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్ చేరుకున్నారు.
♦ రాత్రి 7.14 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామానికి సీఎం జగన్ చేరుకోగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.
♦ 7.25 గంటలకు ఎమ్మిగనూరు మండలం అరెకల్కు, అక్కడి నుంచి 8.15 గంటలకు ఆదోని క్రాస్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
♦ 8.20 గంటలకు ఆదోని నియోజకవర్గం విరుపాపురం చేరుకున్నారు.
♦ 9 గంటలకు ఆలూరు నియోజవకర్గం బిణిగేరి మీదుగా ఆస్పరి చేరుకున్నారు.
♦ 9.30 గంటలకు చిన్నహుల్తి మీదుగా పత్తికొండ బైసాస్ చేరుకోగా నేతలు అపూర్వ స్వాగతం పలికారు.
♦ రాత్రి 9.47 గంటల సమయంలో పత్తికొండ మండలం రాతన సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు.
నేడు తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
4వ రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగనుంది. బస్సు యాత్ర నాలుగో రోజు షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం రాత్రి వెల్లడించారు. పత్తికొండలో రాత్రి బస చేసిన ప్రదేశం నుంచి సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
రాతన మీదుగా తుగ్గలి చేరుకుని ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి.. గుత్తి శివారులో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి మీదుగా సంజీవపురం శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.