
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.96 కోట్ల పురుష ఓటర్లుండగా 2.01 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 24 జిల్లాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలుగా ఉన్నారు.
విశాఖపట్టణం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే మహిళలకన్నా పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగతా 24 జిల్లాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 9.65 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9.60 లక్షలు, అనంతపురం జిల్లాలో 9.56 లక్షలు, విశాఖ జిల్లాలో 9.38 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 9.10 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు.
ఇక ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం సాధారణ ఓటర్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19.12 లక్షల ఓటర్లు ఉండగా ఆ తరువాత అనంతపురం జిల్లాలో 19.11 మంది, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 18.98 లక్షల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 12.61 లక్షల ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 7.68 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7.15 లక్షల ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment