
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంలోకి నూతనంగా చేర్చిన 887 చికిత్సా విధానాలను మిగతా జిల్లాలకు కూడా వర్తింప చేస్తూ వైద్య అరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కూడా చికిత్సా విధానం వర్తింప చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం అరోగ్య శ్రీ కింద ఉన్న 2200 వైద్య చికిత్సలకు అదనంగా మరో 223 చికిత్సలను కూడా చేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. 2020 నవంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఈ వైద్య విధానాలను అమలు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఈ పథకం కింద జారీ చేసిన ఈ వైద్య చికిత్సా విధానాలతో పాటు నూతనంగా అమలు చేసిన ప్రోటోకాల్స్ను దుర్వినియోగం చేయకుండా చూడాల్సిందిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను ప్రభుత్వం అదేశించింది.