ఒక్క ఫ్లాట్‌.. రిజిస్ట్రేషన్‌ ఖర్చులే రూ.5 కోట్లు! ఎవరీ బిజినెస్‌ లేడీ? | Gurugram Property Deal DLF Luxury Flat Sold For Rs 95 Crore, Check Details Inside - Sakshi
Sakshi News home page

Gurugram Property Deal: ఒక్క ఫ్లాట్‌.. రిజిస్ట్రేషన్‌ ఖర్చులే రూ.5 కోట్లు! ఎవరీ బిజినెస్‌ లేడీ?

Published Thu, Feb 22 2024 5:27 PM

Gurugram Property Deal DLF Luxury Flat Sold For Rs 95 Crore - Sakshi

Gurugram Property Deal  : దేశ రియల్‌ ఎస్టేట్‌లో ఖరీదైన డీల్స్‌లో ఒకటి తాజాగా జరిగింది. ఇటీవల గురుగ్రామ్‌లోని అపార్ట్‌మెంట్‌ రూ.95 కోట్లకు అమ్ముడుపోయింది. దీనికి రిజిస్టేషన్‌  ఖర్చులే రూ.5 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తోంది. ఈ ఖరీదైన ఫ్లాట్‌ను ఓ బిజినెస్‌ లేడీ కొనుగోలు చేశారు. ఇంతకీ ఎవరీమె.. ఆ డీల్‌ విశేషాల్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

వెస్‌బాక్ లైఫ్‌స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్, వీ బజార్ సీఎండీ హేమంత్ అగర్వాల్ సతీమణి స్మితి అగర్వాల్ గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ది కామెలియాస్‌లో అపార్ట్‌మెంట్‌ను 95 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సంపాదించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. స్మితి అగర్వాల్ పేరు మీద సేల్ డీడ్ 2024 జనవరి 18న ఖరారైంది. లావాదేవీలో భాగంగా ఆమె రూ. 4.75 కోట్ల స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 50,003 చెల్లించారు. పత్రాల ప్రకారం.. 10,813 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ డీఎల్‌ఎఫ్‌ ది కామెలియాస్‌లో ఉంది. ఇది గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్, డీఎల్‌ఎఫ్‌ ఫేజ్ 5లో ఉన్న ఒక ఉన్నత స్థాయి లగ్జరీ కండోమినియం. అదనంగా అపార్ట్మెంట్‌లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీని చదరపు అడుగు రూ.87,857.20 చొప్పున విక్రయించారు. గురుగ్రామ్‌ ఉన్న ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అనేక ఖరీదైన, లగ్జరీ ఆస్తి లావాదేవీలు జరిగాయి.

ఇటీవలి డీల్స్
గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ది కామెలియాస్ వద్ద 2023 అక్టోబరు3లో 11,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రీసేల్‌  చేయడం ద్వారా రూ. 100 కోట్లకుపైగా లభించింది. అదే నెలలో మేక్‌మైట్రిప్‌ గ్రూప్ సీఈవో రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ మాగ్నోలియాస్‌లోని 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు.

అలాగే జెన్‌పాక్ట్ మానవ వనరుల అధిపతి పీయూష్ మెహతా అదే కాంప్లెక్స్‌లో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ. 32.60 కోట్లకు కొనుగోలు చేశారు. 2023 ఫిబ్రవరిలో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సతీమణి వసుధ రోహత్గీ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో 2,100 చదరపు గజాల బంగ్లాను రూ. 160 కోట్లకు కొనుగోలు చేశారు.

Advertisement
Advertisement