
ఒక్కొక్కటిగా పెరుగుతున్న ధరలు సామాన్యుడికి ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక వస్తువులు ధరలు పెరుగుతుండగా తాజాగా ఈ జాబితాలో అత్యవసర మందులు కూడా వచ్చి చేరాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్, యాంటి ఇన్ఫెక్టివ్ తదితర ఔషధాల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. ఈ ఔషధాల ధరలను 10.70 శాతం వరకు పెంచుకునేందుకు జాతీయ ఔషధాల ధరల నియంత్రణ కమిటీ అనుమతి ఇచ్చింది. దీంతో షెడ్యుల్ డ్రగ్ జాబితాలో ఉంటూ ధరల నియంత్రణ పరిధిలోకి వచ్చే దాదాపు 800ల రకాల ఔషధాల ధరలు పదిశాతం మేర పెరగనున్నాయి. ఈ పెరుగుదలకు సంబంధించిన అంశాలను నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసన్ పరిశీలించనుంది.
షుగర్, బీపీ, ఆస్త్మా, గుండె సంబంధిత వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందులతో పాటు సాధారణ జ్వరం, ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి రోగాలు నయం అయ్యేందుకు వాడే మందుల ధరలు పెరగనున్నాయి, ముఖ్యంగా షుగర్, బీపీ వంటి జబ్బులకు మందులు వాడే వారికి ఈ ధరల పెంపు ఇబ్బందిగా మారనుంది.