
హైదరాబాద్: మార్కెట్లోకి రావడానికి ముందే రిజిస్ట్రేషన్లలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బైకు డిజైన్, డెలివరీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది.
ఎస్ 1 సిరీస్
ఇప్పటికే ఎలక్ట్రిక్ ఓలా స్కూటర్ కావాలంటూ లక్ష మందికి పైగా బుకింగ్లో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే స్కూటర్ ఎలా ఉంటుంది. మోడల్ ఏంటీ అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో పేరుతో రెండు స్కూటర్ల పేర్లు నమోదయ్యాయి. దీని ప్రకారం ఓలా స్కూటర్లు ఎస్ 1 సిరీస్లో మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది.
పది రంగుల్లో
ఇప్పటి వరకు మూడు నాలుగు రంగుల్లోనే వాహనాలు మార్కెట్లో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కానీ గతానికి భిన్నంగా ఒకే సారి పది రంగుల్లో హల్చల్ చేసేందుకు ఓలా సిద్ధమైంది. లేత నుంచి ముదురు వరకు మొత్తం పది రంగుల్లోఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నారు. మేల్, ఫిమేల్ కస్టమర్ల టేస్ట్కి తగ్గట్టుగా ఈ కలర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది.
హోం డెలివరీ
ఇప్పటి వరకు ఆటోమోబైల్ మార్కెట్లో వాహనాలు కొనాలంటే మొదటి మొట్టుగా షోరూమ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఓలా షోరూమ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. స్కూటర్ని బుక్ చేసుకున్న కస్టమర్లకు నేరుగా ఇంటికే హోం డెలివరీ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది.