SEBI: కేవైసీ నిబంధనలు సరళతరం | Sakshi
Sakshi News home page

SEBI: కేవైసీ నిబంధనలు సరళతరం

Published Thu, May 16 2024 2:20 PM

SEBI relief on KYC compliance norms

న్యూఢిల్లీ: కేఆర్‌ఏల (కేవైసీ రిజిస్ట్రేషన్‌ ఏజెన్సీలు) ద్వారా కేవైసీ రికార్డుల ధృవీకరణ ప్రక్రియకు సంబంధించి రిస్కుల నిర్వహణ విధానాన్ని సరళతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం కేఆర్‌ఏలు అధికారిక డేటాబేస్‌ల ఆధారంగా పాన్, పేరు, చిరునామా, ఈమెయిల్, మొబైల్‌ నంబరును ధృవీకరించవచ్చు. ఇవన్నీ సక్రమంగా ఉంటే రికార్డులను ధృవీకరించినట్లుగా పరిగణిస్తారని సైన్‌జీ సహ వ్యవస్థాపకుడు అంకిత్‌ రతన్‌ తెలిపారు. 

పెట్టుబడుల కోసం డిజిటల్‌ ప్లాట్‌ఫాంలను ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో డిజిటల్‌ గుర్తింపును ధృవీకరించడం చాలా కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామం ఇన్వెస్టర్లకు లావాదేవీలను సులభతరం చేసేందుకు తోడ్పడగలదని వివరించారు. కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడానికి వీలుగా ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సంబంధిత మధ్యవర్తిత్వ సంస్థలు మే నెలాఖరు నాటికి తగిన సాంకేతిక మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. 

క్యామ్స్, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మొదలైనవి కేఆర్‌ఏలుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి సాధారణంగా బ్రోకింగ్‌ సంస్థలు, ఎక్సే్చంజీలు, ఇంటర్మీడియరీల నుంచి సేకరించిన ఇన్వెస్టర్ల కేవైసీ వివరాలను నిర్వహిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement