
సంక్షోభంలో చిక్కుకున్న జెన్సోల్ ఇంజినీరింగ్ సంస్థ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ తమ పదవులకు రాజీనామా చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారు కంపెనీ నుంచి తప్పుకున్నారు. అన్మోల్ సింగ్ జగ్గీ ఎండీగా, పునీత్ సింగ్ జగ్గీ హోల్టైమ్ డైరెక్టరు పోస్టులకు రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలియజేసింది. అలాగే, వారిద్దరూ ఇకపై వివిధ కమిటీల్లో సభ్యులుగా కూడా ఉండబోరని పేర్కొంది. నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాల ఆరోపణలపై సెబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో రూ.848 కోట్ల పెట్టుబడి
జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది.