ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తామని.. | Friend Molestation Attack On young woman | Sakshi
Sakshi News home page

ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తామని..

Jun 17 2022 1:09 AM | Updated on Jun 17 2022 1:09 AM

Friend Molestation Attack On young woman - Sakshi

నిజాంపేట్‌ (హైదరాబాద్‌): జూబ్లీహిల్స్‌ సామూహిక లైంగిక దాడి ఘటన మరువక ముందే నగరంలో ఒక యువతిపై జరిగిన అత్యాచారం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీ అనంతరం ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తామని అర్ధరాత్రి సమయంలో యువతి ఇంటికి వచ్చిన స్నేహితుల్లో ఒకరు ఆమెపై లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి ప్రగతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటోంది.

క్రాంతి అలియాస్‌ మ్యాక్స్‌వెల్‌ ఈ నెల 13న తన పుట్టినరోజు ఉందంటూ కంటెంట్‌ రైటర్‌ అయిన 28 ఏళ్ల యువతిని పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్‌లోని రిపీట్‌ పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లింది. పబ్‌లో పార్టీ అనంతరం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తామంటూ క్రాంతితో పాటు స్నేహితులు రోషన్, మనుప్రీత్, కిషోర్‌ ఆమె ఇంటికి వచ్చారు. అందరూ కలిసి మళ్లీ మద్యం సేవించారు.

తెల్లవారుజాము సుమారు 4.30 గంటల వరకు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు. 5 గంటల సమయంలో యువతి నిద్రలోకి జారుకుంది. మిగతావారు కూడా ఆమె ఇంట్లోనే పడుకున్నారు. యువతితో పాటు ఇద్దరు స్నేహితులు ఒక గదిలో, మరో ఇద్దరు ఇంకో గదిలో పడుకున్నారు. సుమారు 6.15 గంటల సమయంలో రోషన్‌ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతన్ని పక్కకు నెట్టివేసేందుకు ప్రయత్నించింది.

అయితే అతడు తనను కొట్టి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు ఆ యువతి 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం లైంగిక దాడికి పాల్పడిన చిత్రపురి కాలనీకి చెందిన రోషన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీరంతా సెంట్రల్‌ యూని వర్సిటీ విద్యార్థులని పోలీసులు పేర్కొంటున్నారు. యువతిపై ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే లైంగిక దాడి జరిగిందా? స్నేహితులు అందరూ దీనికి సహకరించారా? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement