Hyderabad: మరణంలోనూ వీడని స్నేహ బంధం | One Died In Road Accident | Sakshi
Sakshi News home page

Hyderabad: మరణంలోనూ వీడని స్నేహ బంధం

Published Mon, Aug 5 2024 6:55 AM | Last Updated on Mon, Aug 5 2024 6:55 AM

One Died In Road Accident

ఫ్లై ఓవర్‌పై అదుపు తప్పిన బైక్‌ 

గోడకు ఢీకొని రోడ్డుపై పడి.. 

ఇద్దరు యువకుల దుర్మరణం 

గచ్చిబౌలి ఠాణా పరిధిలో  ఘటన  

స్నేహితుల దినోత్సవం రోజున విషాదం 

మృతులు ఏపీలోని గుంటూరు జిల్లా వాసులు  

రాయదుర్గం: స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు వి.బాల ప్రసన్న (24) ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. 

ఇదే జిల్లా మర్రిచెట్టుపాలేనికి చెందిన తన స్నేహితుడు కె.రోహిత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో కలిసి బాలప్రసన్న మియాపూర్‌లోని హఫీజ్‌పేట్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం వేకువజామున బైక్‌పై వెళ్తున్నారు. రోహిత్‌ వాహనం నడిపిస్తుండగా ప్రసన్న వెనక సీటులో కూర్చున్నాడు. మసీదుబండ నుంచి హఫీజ్‌పేట్‌ మార్గంమధ్యలో కొత్తగూడ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ మూల మలుపు వద్ద వీరి బైక్‌ అదుపు తప్పి ఫ్లై ఓవర్‌ గోడను ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు.

 ఇద్దరి తలలకు, ఇతర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రసన్నను కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రికి, రోహిత్‌ను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రోహిత్‌ మృతిచెందాడు. బాల ప్రసన్న 5.18 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 48 నిమిషాల వ్యవధిలో ఇద్దరు స్నేహితులూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement