సైబర్‌ నేరగాళ్లతో ప్రైవేటు బ్యాంకుల అధికారులు కుమ్మక్కు! | Some Private bank staff colluding with Hackers | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లతో ప్రైవేటు బ్యాంకుల అధికారులు కుమ్మక్కు!

Published Thu, Jan 30 2025 9:22 AM | Last Updated on Thu, Jan 30 2025 2:10 PM

Some Private bank staff colluding with Hackers

సీజ్‌ చేసిన ఖాతాబుక్‌లను చూపుతున్న సీపీ సీవీ ఆనంద్‌

  • ప్రైవేట్‌ బ్యాంకుల అధికారుల కాసుల కక్కుర్తి
  • సైబర్‌ నేరగాళ్లతో కుమ్మక్కవుతున్న వైనం
  • రెండు కేసుల దర్యాప్తులో వీరి పాత్ర గుర్తించిన పోలీసులు
  • మూడు బ్యాంకులకు చెందిన ముగ్గురు కటకటాల్లోకి..
  • వీరితో పాటు 10 రాష్ట్రాలకు చెందిన మొత్తం 52 మంది అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: నేపాల్, చైనాల్లో కూర్చుని, దేశ వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, యాప్‌ల ద్వారా వివిధ రకాలైన సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో స్థానిక ప్రైవేటు బ్యాంకుల మేనేజర్లూ కుమ్మక్కవుతుండటం ఆందోళన కలిగించే అంశం. రెండు కేసుల దర్యాప్తు నేపథ్యంలో హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వీరి పాత్రను గుర్తించారు. ఆర్బీఎల్, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంకులకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. 

ప్రత్యేక బృందాలు పది రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో వీరితో సహా 52 మందిని పట్టుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ నిందితులపై నగరంలో 33, రాష్ట్రంలో 74, దేశ వ్యాప్తంగా 576 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామన్నారు. డీసీపీ దార కవిత, ఏసీపీ ఆర్‌జీ శివ మారుతిలతో కలిసి బుధవారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ వివరాలు వెల్లడించారు. 

సేవింగ్‌కు ఒక రేటు కరెంటుకు ఒక రేటు..
సైబర్‌ నేరాల సూత్రధారులకు బాధితులతో నగదు డిపాజిట్‌ చేయించుకోవడానికి సేవింగ్స్‌ ఖాతా, కాజేసిన భారీ మొత్తాలను డ్రా చేసుకోవడానికి కరెంట్‌ ఖాతాలు అవసరం. దీనికోసం వీళ్లు నేపాల్‌కు చెందిన కొందరిని దళారులుగా మార్చుకుంటున్నారు. వీరు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచరిస్తూ స్థానిక మధ్యవర్తుల ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు. నిబంధనలేవీ పట్టించుకోకుండా బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వాలని, లావాదేవీల్లో నిబంధనల ఉల్లంఘనలను కూడా చూసీ చూడనట్లు వదిలేయాలని చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నారు. సేవింగ్‌ ఖాతాకు రూ.50 వేల వరకు, కరెంట్‌ ఖాతాకు రూ.80 వేల వరకు తీసుకుంటున్న బ్యాంకు అధికారులు సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. ఆయా ఖాతాలకు సంబంధించిన నెట్‌ బ్యాంకింగ్‌ను ఆపరేట్‌ చేయడానికి అవసరమైన వివరాలన్నీ టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా సూత్రధారులకు చేరుతున్నాయి.  

కేసుల దర్యాప్తులో వెలుగు చూసిన లింకులు
నేపాల్‌కు చెందిన మహేష్‌ అనే వ్యక్తి ద్వారా బెంగళూరు విద్యారణ్యపురలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ డిప్యూటీ మేనేజర్‌ శుభం కుమార్‌ ఝా, మల్లీశ్వరంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరూన్‌ రషీద్, ఫ్యాబ్రికేషన్‌ వ్యాపారి ఆర్‌.మోహన్‌ సైబర్‌ క్రైమ్‌ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించారు. వివిధ బ్యాంకుల్లో 20 బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీరు సహకరించారు. ఈ ఖాతాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.23 కోట్లు కాజేశా రు. హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన రూ.93 లక్షల ట్రేడింగ్‌ ఫ్రాడ్‌ కేసు దర్యా ప్తులో బెంగళూరు లింకులు గుర్తించిన పోలీ సులు ఆ ముగ్గురినీ కటకటాల్లోకి పంపారు. అలాగే గతంలోనే జరిగిన, రూ.2.06 కోట్లతో ముడిపడి ఉన్న మరో ట్రేడింగ్‌ ఫ్రాడ్‌ కేసు దర్యాప్తులో హైదరాబాద్‌ జేఎన్టీయూలో ఉన్న కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సేల్స్‌ మేనేజర్‌ కాటా శ్రీనివాస్‌ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇతడితో పాటు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి సహకరించిన వారినీ పోలీసులు అరెస్టు చేశారు.

తొలిసారిగా క్రిప్టో కరెన్సీ స్వాధీనం
ఈ ఫ్రాడ్‌లో పలువురు నిందితులు నగరానికి చెందిన వారే అని తేలింది. వీరంతా టెలి గ్రామ్‌ యాప్‌ ద్వారా నేరగాళ్ల నెట్‌వర్క్‌లోకి ప్రవేశించారు. వీరి నుంచి రూ.47.5 లక్షల నగదుతో పాటు క్రిప్టో కరెన్సీ రూపంలో ఉన్న రూ.40 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. క్రిప్టో కరెన్సీని సీజ్‌ చేయడం నగర పోలీసు చరిత్ర లో ఇదే తొలిసారి. కాగా ఈ ఖా తాల ద్వారా జరిగే ప్రతి లావా దేవీకి గాను కాటా శ్రీనివాస్‌కు ఒక శాతం కమీషన్‌గా ముట్టడం గమనార్హం.

పలు మోసాల్లో నిందితులుగా..
ఈ కేసులో వీరితో పాటు అరెస్టు అయిన 52 మంది నిందితులు ఆన్‌లైన్‌ లేదా ఫోన్‌ కాల్‌ ద్వారా ఎర వేసి, వివిధ రకాలైన పేర్లు చెప్పి నగర వాసుల నుంచి రూ.8.83 కోట్లు కాజేసిన కేసు ల్లోనూ నిందితులుగా ఉన్నారు. సోషల్‌మీడియా గ్రూపుల ద్వారా ఎర వేసి, పెట్టుబడుల పేరుతో స్వాహా చేసే ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్స్‌తో పాటు డిజిటల్‌ స్కామ్స్‌ కేసుల్లోనూ వీళ్లు నిందితులుగా ఉన్నారు. కాగా వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.87 కోట్లు ఫ్రీజ్‌ చేశారు. ‘సైబర్‌ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పిరామల్‌ ఫైనాన్స్‌ సంస్థతో కలిసి పని చేస్తున్నాం..’ అని కమిషనర్‌ చెప్పారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement