
సాక్షి, తిరుపతి: తలకోన జలపాతం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారం కోసం వెళ్లిన యాత్ర.. విషాదకరంగా ముగిసింది. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయ చెన్నైకి చెందిన సుమన్(23) మృతిచెందాడు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల ప్రకారం.. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమన్ మృత్యువాతపడ్డాడు. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కాగా, చెన్నైలో ఎమ్మెస్సీ చదువుతోన్న సుమంత్ తిరుపతికి చెందిన సహ విద్యార్ధితో కలిసి తలకోనకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. జలపాతంపై నుంచి దూకుతూ వీడియో తీయమని స్నేహితుడిని కోరాడు.
ఈ క్రమంలో పై నుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు. సుమంత్ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: ప్లాట్ఫామ్పై పిచ్చి చేష్టలు.. లోకల్ ట్రైన్ ఢీకొనడంతో గాల్లోకి ఎగిరి..