సారీ చెప్పడం తెలియకపోతే... | Sakshi Guest Column On Congress Party Leader Rahul Gandhi | Sakshi

సారీ చెప్పడం తెలియకపోతే...

Apr 3 2023 12:11 AM | Updated on Apr 3 2023 12:11 AM

Sakshi Guest Column On Congress Party Leader Rahul Gandhi

విధి విచిత్రమైనది. విరుద్ధంగా తిరుగుతాయని ఎంతమాత్రమూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. 2013లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ ను ‘పూర్తిగా అర్థరహితం’ అని పేర్కొంటూ రాహుల్‌ చింపేశారు. తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మో హన్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించారు. ఆ ఆర్డినెన్స్ పాస్‌ అయి ఉంటే, పార్లమెంట్‌ నుంచి రాహుల్‌ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది. కానీ ‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’ అన్న వ్యాఖ్య మన్మోహన్‌ను ప్రధానిగా బలహీనపర్చింది. అందుకే, మన్మోహన్‌ కు బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్‌ బకాయి పడ్డారు. కానీ ఆయన మూర్ఖంగా ‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’ అంటూ ప్రగల్భాలకు పోయారు. క్షమాపణ అవసరమైనప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మిగిలిపోతారు.

విధికి సంబంధించిన చమత్కారాలు, వక్రోక్తులు నాకు ఎంతో ఆసక్తి గొలుపుతుంటాయి. ఘటనలు మీకు విరుద్ధంగా జరుగుతాయని మీరు అసలు ఎంతమాత్రమూ ఊహించనప్పుడు, అవి వాస్తవంగా అలాగే పైకి తేలుతాయి. అవును, అలాగే జరుగుతాయి. వ్యావహారి కంగా దీన్ని ‘సోడ్‌ న్యాయం’ అని పిలుస్తారు. (ఒకటి తప్పుగా జరిగే అవకాశం ఉంటే, అది చివరకు తప్పుగానే జరుగుతుందని బ్రిటన్లో నవ్వుతూ చెప్పే మాట.) షేక్‌స్పియర్‌ వంటి నాటకకర్త చేతుల్లో అది మితిమీరిన గర్వంగా పరివర్తన చెందుతుంది. ఆయన గొప్ప విషాదాంత నాటకాలు ఈ వ్యవహారం పైనే ఆధారపడి రూపొందాయి. ఏ రకంగా చూసినా, ఇది ‘దేవుడి లీలావిలాసాలు’ మనకు వెల్లడయ్యే క్షణం!

రెండు క్షమాపణలు
కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విషయంలో జరిగింది అదే. ఆడంబరంగా, అలా కాదనుకుంటే డాంబికంగా అయన పత్రికా సమా వేశంలో ఇలా ప్రకటించారు: ‘‘నా పేరు గాంధీ; గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’’. దురదృష్టవశాత్తూ ఇద్దరు వ్యక్తులకు ఆయన క్షమాపణలు బాకీ పడ్డారని స్పష్టమైన సమయంలోనే, ఆయన ఈ వ్యాఖ్య చేశారు. చాలా స్పష్టంగా అది బహిర్గతమైన విషయం. పైగా అది కచ్చితంగా బహిరంగంగా జరిగిన విషయం.

రాహుల్‌ తన తొలి క్షమాపణను మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు బాకీ పడ్డారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ను ‘‘పూర్తిగా అర్థరహితం’’ అని పేర్కొంటూ రాహుల్‌ దాన్ని చింపేశారు. విచిత్రమైన విషయం ఏమి టంటే, ఆ ఆర్డినెన్స్ పాస్‌ అయి ఉంటే, పార్లమెంట్‌ నుంచి రాహుల్‌ గాంధీ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఎందుకంటే, ఆ ఆర్డినెన్సు ఇలా ఒక శాసనాన్ని పొందుపర్చింది.

‘‘శిక్ష పడిన నాటి నుంచీ 90 రోజులలోపు, ఆ శిక్షను పునర్విమర్శ చేయమని కోరుతూ ఒక విజ్ఞప్తి లేదా అభ్యర్థనను దరఖాస్తు చేసినట్లయితే’’ కనీసం రెండేళ్ల శిక్ష పడిన పార్లమెంట్‌ సభ్యుడి తక్షణ అనర్హత అనేది అనిశ్చిత స్థితిలోకి వెళ్తుంది. (ఇంకోరకంగా చెప్పాలంటే, అప్పటికి నిలుపుదల అవు
తుంది.)

ముందుచూపు లేకపోవడం
2013లో రాహుల్‌ గాంధీ గుర్తించనిది – బహుశా, ఈరోజు ఆయన మర్చిపోనిది ఏమిటంటే, ఆయనకు పడిన శిక్షపై ఒకవేళ న్యాయస్థానం చివరకు స్టే విధించినప్పటికీ... ప్రస్తుత పార్లమెంటులో ఆయన చాలా వారాలపాటు అడుగుపెట్టే అవకాశం అప్పటికి కోల్పోయివుంటారు. ఇది కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు.

అంతకంటే ముఖ్యంగా, ఆయన నియోజక వర్గమైన వయనాడ్‌ (కేరళ)కు ఈ కాలంలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. నిజానికి, ఇది భార తీయ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తుందని కూడా మీరు వాదించ వచ్చు. ఎందుకంటే మామూలుగా లోక్‌సభలో వ్యక్తీకరించగలిగిన ఒక అభిప్రాయం వినలేని పరిస్థితి వస్తున్నది కాబట్టి.

2013లో రాహుల్‌ గాంధీ ఆ ఆర్డినెన్‌్సను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కాపాడటానికి తెస్తున్న ముతక, ఇంకా చెప్పాలంటే అనైతిక ప్రయత్నంగానే చూశారు. కానీ ఆ ఆర్డినెన్స్కు అంతకంటే మించిన విలువ ఉందని ఆయన చూడలేకపోయారు. ఇంకా చెప్పాలంటే చూడ దల్చలేదు కూడా. బహుశా ఆ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉందన్న అంశంపైనే ఆయన దృష్టి మొత్తంగా ఉండేది. అయితే ఆయన ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది.

ఇంకా ఘోరమైన సంగతి ఏమిటంటే, తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మోహన్‌ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగా రాహుల్‌ అవమానించారు. ‘‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’’. ఇది జూలియస్‌ సీజర్‌ను బ్రూటస్‌ పొడిచేయడం లాంటిదే. ఆ వ్యాఖ్య మన్మోహన్‌కు నష్టం చేయడమే కాదు, ప్రధానిగా ఆయన్ని బలహీన పర్చింది. అందుకే, డాక్టర్‌ మన్మోహన్‌  సింగ్‌కు పూర్తిగా బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్‌ గాంధీ బకాయి పడ్డారు.

సముచితం కాని స్పందన
రెండో క్షమాపణ – అది చెప్పడం జరిగినట్లయితే– రాహుల్‌ ఎలాంటి వ్యక్తో వెల్లడవుతుంది. అది ఆయన స్వభావానికి, చివరకు తన నైతిక సమగ్రతకు కూడా పరీక్షే అవుతుంది. అందువల్ల, ఈ రెండు క్షమాపణలు చెప్పడం కష్టమైనవే కానీ అవి మరింతగా అవసర మైనట్టివి.

‘‘ఓబీసీ కమ్యూనిటీని రాహుల్‌ గాంధీ అవమానించారని బీజేపీ చేసిన ఆరోపణపై మీ అభిప్రాయం ఏమి’’టని మార్చి 25న జరిగిన ఒక ప్రెస్‌ కాన్ఫరెన్సులో అడిగిన ఒక జర్నలిస్టు పట్ల రాహుల్‌ చాలా గర్వంతోనూ, మొరటుగానూ వ్యవహరించారు. కచ్చితమైన, సముచి తమైన ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా రాహుల్‌ ఆ విలేఖరిపై మాటల దాడికి దిగారు. 

‘‘నువ్వు బీజేపీకి ఇంత నేరుగా ఎందుకు పనిచేస్తున్నావ్‌... నీకు వారి నుంచి ఆదేశాలు అందాయా... నువ్వు బీజేపీ కోసం పనిచేయాల నుకుంటే, బీజేపీ జెండా... లేదా గుర్తు ... తెచ్చుకుని నీ ఛాతీపై పెట్టుకో... అప్పుడు వారికి నేను ఏ రీతిలో సమాధానం చెబుతానో నీకు కూడా అలాగే జవాబు చెబుతాను. అంతేకానీ పత్రికల మనిషిగా నటించవద్దు.’’

ఇబ్బంది కలిగించేలా తన స్థిరత్వాన్ని, స్థిమితాన్ని కోల్పోవడం సరిపోలేనట్టుగా– రాహుల్‌ గాంధీ ఆ జర్నలిస్టును మరింత వెటకారం చేశారు. ఇంకో ప్రశ్న (మరెవరో) అడుగుతుండగా, అందరికీ వినబడే ట్టుగా రాహుల్‌ గాంధీ ‘‘హవా నికల్‌ గయీ’’(గాలి పోయింది) అనే శారు. ఆయన ముఖంలో తెలివితో కూడిన నవ్వు పరిస్థితిని మరింతగా దిగజార్చివేసింది.

క్షమాపణ మనిషిని తగ్గించదు
రాహుల్‌ గాంధీ చెప్పింది సమర్థించుకోలేనిది. దీంతో ఎవరైనా అంగీకరించారంటే నాకు సందేహమే. అయినా సరే ఆయన క్షమాపణ  చెబుతారా? ఇది యధాలాపంగా సంధించిన ప్రశ్న కాదు. ఇది రాహుల్‌ వ్యక్తిత్వానికి, నైతిక స్వభావానికి కొలమానం. నిజాయితీగా చెప్పాలంటే, రాహుల్‌ ఎలాంటి వ్యక్తి అని తెలిపే పరీక్ష ఇది.

వివేకం, ఆత్మసాక్షి ఉన్న రాజకీయ నాయకుడు క్షమాపణ చెబుతారు. పైగా క్షమాపణ అనేది రాహుల్‌ గాంధీ స్థాయిని పెంచు తుంది. ఆయన పట్ల మన గౌరవం పెరిగేట్లు కూడా చేస్తుంది. కానీ ఆయన ఇప్పటికే మూర్ఖంగా ప్రగల్భాలకు పోయారు: ‘‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు.’’ ఒకవేళ అదే ఆయన వైఖరి అయితే, అంటే క్షమాపణ అవసరమైనప్పుడు, దాన్ని బాకీ పడిన ప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం అనేది దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మారిపోతారు.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement